యాంటీ వైరస్... సేఫ్ బ్రౌజింగ్..

16 Mar, 2015 02:23 IST|Sakshi

 నెట్ ఉపయోగించాలంటే ఉండాల్సిందే
  పీసీకే కాదు మొబైల్‌కూ తప్పనిసరి
  టెక్నాలజీతోపాటు అప్‌గ్రేడ్ అవుతున్న సాఫ్ట్‌వేర్లు
  రూ.350 నుంచి రూ.3 వేల ధరల్లో వెర్షన్లు
 
 ల్యాప్‌టాప్‌లో ఏదో ముఖ్యమైన పనిచేస్తుంటాం అంతలోనే సిస్టమ్ స్లో అయిపోతే... కంప్యూటర్‌లో ఏదో అప్లికేషన్ ఫిల్ చేస్తుంటాం అంతలోనే డేటా మిస్ అయిపోతే... ఇలాంటి ఇబ్బందులను విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఎదుర్కొనే ఉంటారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి యాంటీ వైరస్‌లే సరైన టానిక్ అని నిపుణులు చెబుతున్నారు. పీసీలు, ల్యాప్‌టాప్‌లకే కాదు స్మార్ట్‌ఫోన్ మొబైల్స్‌కు యాంటీ వైరస్ యాప్స్ నగరంలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటర్నెట్‌లో ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్ కన్నా.. సెలెక్టెడ్ కంపెనీలకు చెందిన యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సేఫ్ బ్రౌజింగ్‌ను మన సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
 
 విజయనగరం టౌన్:ఇంటికి గొళ్లెం ఎలానో సిస్టమ్, మొబైల్‌కు యాంటీ వైరస్ అలాగని చెప్పవచ్చు. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా తెలియకుండా మనల్ని ఇబ్బందిపెట్టే వైరస్ అయితే సేఫ్... లేదంటే సిస్టమ్ నెమ్మదిస్తుంది. మనం స్టోర్ చేసిన సమాచారం పోవచ్చు. చివరకు పూర్తిగా పీసీ పాడైపోవచ్చు. ఆధునిక మానవుడి ప్రతి పనినీ సులభతరం చేస్తున్న టెక్నాలజీని.. వినాశనానికి ఉపయోగిస్తుంటారు హ్యాకర్లు, వైరస్ రూపకర్తలు. అయితే యాంటీ వైరస్ ఉపయోగించడం ద్వారా పీసీ లేదా ల్యాప్‌టాప్‌ను సెక్యూర్డ్‌గా ఉంచుకోవచ్చు. దీనికి సంబంధించిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లు నగరంలోని డాబాగార్డెన్స్, జగదాంబ, ద్వారకానగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ స్టోర్స్, స్పేర్‌పార్టుల షాపుల్లోలభిస్తున్నాయి.
 
 ఎన్నో స్పెసిఫికేషన్లు
 క్యాన్ఫర్‌స్కై.కె7, అవాస్టా... ఇలా ఎన్నో రకాల యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అంతేకాక ఇంటర్‌నెట్‌లో అనేక కంపెనీల సాఫ్ట్‌వేర్లు వివిధ స్పెసిఫికేషన్లతో కనిపిస్తుంటాయి. అయితే వాటిలో ఏ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనే విషయంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. మొబైల్, పీసీ కాన్ఫిగరేషన్ ఉపయోగాన్ని బట్టీ ఏ యాంటీ వైరస్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. సాధారణంగా రూ.350 నుంచి రూ.3 వేల వరకు వివిధ కంపెనీల యాంటీ వైరస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సింగిల్ నుంచి 50 కంప్యూటర్లకు వినియోగించే ప్యాక్‌లు సైతం లభిస్తాయి. ధర పెరిగే కొద్ది యాంటీ థెఫ్ట్, ఫోన్ లేదా సిస్టమ్ వేగంగా పనిచేసేలా చేయడం, అనుమానాస్పద ఫైల్స్, మెయిల్స్ సైట్స్‌పై అలర్ట్ చేయడం, స్కాన్ చేసే సదుపాయాలు పొందొచ్చునని డాబాగార్డెన్స్‌లో ఉన్న అనిల్ యాంటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధినేత సత్యనారాయణ తెలిపారు.
 
 ూ మూలపడేయాల్సిన పరిస్థితి
 స్మార్ట్ ఫోన్ల ధరలు అందుబాటులోకి రావడంతో అందరూ వినియోగిస్తున్నారు. కానీ అందులో ఉపయోగించాల్సిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లపై ఎవరికీ అవగాహన ఉండట్లేదు. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను కొన్ని రోజులకే మూలన పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సిస్టమ్ లేదా ల్యాప్‌టాప్ అయితే మరమ్మతు చేయించి మళ్లీ వాడే అవకాశం ఉన్నా.. ఫార్మాట్, రీబూట్ చేసిన తర్వాత పనివేగం నెమ్మదిస్తుంది.
 
  తెలిసింది గోరంత...
 మన దేశంలో యాంటీ వైరస్ వినియోగం గణాంకాలు చూస్తే ఔరా అనిపిస్తాయి. మొత్తం యూజర్లలో కేవలం 13 శాతమే లెసైన్స్‌డ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నారు. 50 శాతంమందికి పైగా యాంటీ వైరస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న సంగతే తెలియడం లేదు. ఓ ప్రఖ్యాత వెబ్‌సైట్ చేసిన పరిశీలనలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.
 
 
 ధరను బట్టే ప్రొటెక్షన్
 సాధారణంగా ఏ వస్తువైనా ధరను బట్టే నాణ్యత ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్స్ అయితే ధరను బట్టి ఫీచర్స్ పెరుగుతాయి. వైరస్ సోకడం వల్ల బ్యాకప్ పోవడం, డేటా లాస్ అవ్వడం వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా జరిగితే సిస్టమ్‌ను రీబుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసినా బ్యాకప్ డేటా మిస్ అవుతాం. అందుకే సిస్టమ్‌కు యాంటీ వైరస్ తప్పకుండా ఉండాలి. నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నది కాకుండా నేరుగా కంపెనీవి వాడితే మరింత బాగుంటుంది.
 -సురేష్ కుమార్, హార్డ్‌వేర్ ఇంజనీర్, విజయనగరం
 

మరిన్ని వార్తలు