‘పెదరాయుడు’ అంత హిట్ కొడుతుంది

1 Feb, 2014 04:05 IST|Sakshi
  •      షిరిడీ నాథుడి ఆశీస్సులతో విజయాలు
  •      సినీ నటుడు మోహన్‌బాబు
  •   తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై శుక్రవారం విడుదలైన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా ‘పెదరాయుడు’ అంతటి విజయం సాధిస్తుందని సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. తొలి రోజు తిరుపతిలోని బిగ్‌సీ థియేటర్‌లో పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాన్ని తిలకించారు. అనంతరం బిగ్‌సీ థియేటర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    తన కుమారులు మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్‌తో కలసి నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాకు మొదటి రోజు ఇంతగా ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తో నటించిన పెదరాయుడు సినిమా ఎంతో గొప్ప విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు. ఈ సినిమా కూడా పెదరాయుడు సిని మా అంత విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిని మా విజయం సాధించినా, ఓటమి పాలైనా కష్టం మాత్రం ఒక్కటేనని తెలిపారు.

    నాటి పాండవ వనవాసం సినిమాను గుర్తు చేస్తూ, హాస్యా న్ని పండిస్తూ కుటుంబసమేతంగా చూడగలిగే విధంగా పాండవులు పాండవులు తుమ్మెద చిత్రీకరించినట్టు చెప్పారు. షిరిడీ సాయినాథు ని ఆశీస్సులు, గురువు దాసరి నారాయణరావు దీవెనలతో సొంత బ్యానర్‌పై విడుదల చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సమావేశంలో బిగ్‌సీ థియేటర్ మేనేజర్ సురేష్, విష్ణు, మనోజ్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి, కుమార్, గోపిసాయి, శశి, హేమంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు