-

అస్మదీయులకే కొలువులన్నీ

11 Nov, 2017 01:02 IST|Sakshi

శాశ్వత ఉద్యోగ నియామకాలకు సర్కారు మంగళం.. అంతా ఔట్‌సోర్సింగ్‌.. అదీ ‘తమ ఏజన్సీ’ ద్వారానే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించే నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను ఔట్‌ ‘రేటు’పోస్టుల మాదిరిగా మార్చేస్తోంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామక కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో తమకు సంబంధించిన ఏజె న్సీకి అప్పగించి దాని ద్వారా తమ పార్టీకి అనుకూలురనే ‘ఎంపిక’ చేసుకోవాలని తల పోస్తోంది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయవద్దని, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయిలో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా తీసుకుం టామని విద్యాశాఖలో ఇప్పటికే మౌఖిక ఆదే శాలు జారీ అయ్యాయి. ఇతర శాఖల్లోనూ ఇదే రీతిలో చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నా హాలు చేపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.42 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఒక్కటీ భర్తీ చేయక పోగా ఉన్నవాటికే ఉద్వాసన పలికేందుకు సిద్ధం కావటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 

పోస్టుకు రూ. 2 లక్షలు చెల్లించేలా ఏజన్సీతో బేరం!
ఔట్‌సోర్సింగ్‌ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకూ జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు ప్రైవేట్‌ ఏజెన్సీలను ఎంపిక చేసి వాటి ద్వారా ఉద్యోగులను తీసు కుంటున్నాయి. ఇప్పుడు వీటిని రద్దుచేసి రాష్ట్ర స్థాయిలో తమకు సంబంధించిన ఏజెన్సీకి ఎంపిక కాంట్రాక్టు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. పీఆర్సీతో ఔట్‌సోర్సింగ్‌ వేత నాలు కొంతమేర పెరగడం, భారీగా పోటీ పడుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచు కుని రాష్ట్ర స్థాయిలోఎంపికైన ఏజన్సీ ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలకు పైగా పెద్దలకు చెల్లిం చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలి సింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది అశనిపాతంగా మారనుంది. 

12 వేల మందిపై పిడుగు! 
విద్యాశాఖలో 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా బోధనేతర పోస్టులు కూడా వేలల్లోనే ఖాళీలున్నాయి. సర్వశిక్ష అభియాన్, డీఈఓ ఎంఈవో కార్యాలయాలతో పాటు అనేక విభాగాల్లో వేలాది మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 664 మండల విద్యాధికారి కార్యాలయాల్లో 5,312 వరకు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో 7,392 మంది, జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో 260 మంది, ఎస్‌ఎస్‌ఏ పీవో కార్యాలయాల్లో 260 మంది, క్లస్టర్‌ రిసోర్సు పర్సన్లు 4,000 వేల మంది వరకు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. మొత్తం 17,224 పోస్టుల్లో దాదాపు 12 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు న్నారు. మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులు భర్తీచేయవద్దని మంత్రి గంటా సూచనల మేరకు అధికారులు ఆయా విభాగాలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. 

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో ఆందోళన
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్రస్థాయిలో ఒకే ఏజెన్సీకి కట్టబెట్టాలని నిర్ణయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పనిచేస్తున్న వారి సర్వీసులు డిసెంబర్‌తో ముగియనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీరిని పొడిగించే అవకాశాలు లేకుండా పోయాయి.  

ఏజన్సీల చుట్టూ నిరుద్యోగుల ప్రదక్షిణ
ఔట్‌సోర్సింగ్‌ నియామకాలకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు ఆర్థిక శాఖ గతంలో 4271 జీవో ద్వారా విధివిధానాలు ప్రకటించింది. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా, ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరక్టర్, జిల్లా లేబర్‌ ఆఫీసర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి సభ్యులుగా ఉన్న కమిటీ ఏజెన్సీలను గుర్తిస్తుంది. ఆయా సంస్థలు ఈపీఎఫ్, ఈఎస్‌ఐతో సహా కార్మిక చట్టాల ప్రకారం ఇతర అన్ని అంశాలను పాటిస్తున్నా యో లేదో పరిశీలించి ఎంపిక చేస్తాయి. ఉద్యోగులను ఎంపిక చేసే సంస్థలకు కొంత కమీషన్‌ను చెల్లిస్తుంది. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సర్వీసును ఏడాది మాత్రమే కొనసా గిస్తారు. రెన్యువల్‌ చేస్తేనే వారికి పోస్టు ఉంటుంది. ఆయా సంస్థలు కూడా ఉద్యోగుల వేతనం నుంచి కొంత మినహాయించుకుం టున్నాయి. శాశ్వత ఉద్యోగాల భర్తీ లేకపోవటంతో నిరుద్యోగులు ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల చుట్టూ క్యూ కడుతున్నారు.

మరిన్ని వార్తలు