వైఎస్‌ జగన్‌ గొప్ప మానవతావాది

14 Aug, 2019 08:53 IST|Sakshi

19 చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టారు 

మానవత్వంతో కూడిన 14 చట్టాలను చేశారు

సభాపతిగా ఎంతో ఆనందం కలిగింది

చిన్నతనం నుంచి ఎదురు చూస్తున్న బిల్లులు నా హయాంలో రావడం గొప్పగా భావించా

ఒకానొక సందర్భంగా ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నా

‘సాక్షి’తో మనసులోని మాటలను పంచుకున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం  

సాక్షిప్రతినిధి, శ్రీకాకుళం : ‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప మానవతావాది. ప్రజల కోసం ఎందాకైనా వెళ్తారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకోని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే ముఖ్యమంత్రి ఆయన. 19 బిల్లులు ప్రవేశపెట్టడం, 14 చట్టాలు చేయడమంటే ఆషామాషీ కాదు. మానవతా దృక్పథంతో కూడిన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఉద్వేగానికి లోనయ్యా ను. ఒకానొక సందర్భంలో కళ్లంట నీరు వచ్చేసింది. నా చిన్నతనం నుంచి అలాంటి బిల్లులు రావాలని చెప్పుకోవడం తప్ప అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాఖలాల్లేవు. ఎంతో విశిష్టత గల బి ల్లులు ఆమోదం పొందిన సభకు నేను సభాపతిని కావడం ఎంతో ఆనందం కలిగింది.’ అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన మనసులో మాటలను వ్యక్తపరి చారు. కొత్త ప్రభుత్వం పనితీరుపై తన మనోగతాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

నా హయాంలో 19 బిల్లులు ప్రవేశ పెట్టడం అదృష్టం..

నేను స్పీకర్‌గా ఉన్న సమయంలో శాసన సభలో 19 బిల్లులు ప్రవేశపెట్టడం 14 బిల్లులు ఆమోదించడం అదృష్టంగా భావిస్తున్నాను. చరిత్రాత్మక బిల్లుగా 50 శాతం మహిళల రిజర్వేషన్‌ నిలిచిపోతుంది. నేను నిక్కర్లు వేసినప్పటి నుంచి మహిళా రిజర్వేషన బిల్లు తప్పనిసరిగా అమలుచేయాలని ప్రతిపాదనలు తప్ప ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. నేను స్పీకర్‌గా ఉన్న సమయంలో ఇంతటి ఘన చరి త్ర ఉన్న బిల్లు ప్రవేశపెట్టడంతో చాలా సం తోషించాను. దీని వల్ల సామాజిక స్థితిగతులు మారుతాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీలకు రిజర్వేషన్‌ కల్పించడమే కాదు చేసి చూపిం చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనార్టీల్లో ఒక్కొక్కరిని డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్లుగా, మంత్రులుగా ఎంపిక చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మానవతావాది జగన్‌మోహన్‌రెడ్డి. బీసీ ల్లో సభాపతిగా నన్ను ఎంపిక చేసి రాజ్యాంగ వ్యవస్థకు పరిచయం చేసి గౌరవ ప్రదమైన స్థానంలో ఉంచారు.

చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు.. 

టెండర్ల ప్రక్రియలో పారదర్శకత కోసం జ్యుడిషియల్‌ కమిషన్‌ వేసి పనుల్లో అవినీతి జరగకుండా చేయడం గొప్ప నిర్ణయం. కౌలుదార్ల చట్టం, భూ యజ మానులకు భరోసా ఇచ్చే చట్టం భూసర్వేకు సమగ్రంగా జరిగేందుకు నిర్ణయాలు తీసుకోవ డం అభినందనీయం. సామాజిక న్యాయం కోసం మాటలు విన్నా.. కానీ చట్టం చేసిన వ్యక్తి జగన్‌ మాత్రమే. బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు నాకెంతో ఆనందం కల్గించాయి. 
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు గొప్ప నిర్ణయం. దీని వల్ల నిరుద్యోగం తగ్గుతుంది. మహిళల రిజర్వేషన్‌ కోసం చాలా మంది తమ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కానీ  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా ప్రవేశపెట్టారు. ఎలాంటి గొప్పలకు పోలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చీఫ్‌ మినిస్టర్‌ కంటే ముందు గొప్ప మానవతావాది అని చెప్పకతప్పదు.

చక్కగా మాట్లాడారు.. 
జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. చక్కగా మాట్లాడారు. నేను కూడా అందుకు తగ్గ అవకాశాన్ని కల్పించాను. ఈ శాసన సభలో సుమారు 70మందికి పైగా కొత్త ఎమ్మెల్యేలున్నా రు. ముందుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకే మాట్లాడే అవకాశం కల్పించి వారిని ముందుకు తీసుకెళ్లేలా సీఎం కూడా ప్రోత్సహించారు. చా లా మంది ఉన్నత చదువులు చదువుకున్న వారే. ప్రత్యేకంగా విషయాన్ని తర్ఫీదు చేసుకోవాల్సిన అవసరం వారికి రాలేదు. అందరూ తమ వాణి వినిపించారు. రాష్ట్రంలో సుగర్‌ ఫ్యాక్టరీలు తెరి పించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. వాటికి మంచి రోజులొస్తాయి. అందులో ఎలాం టి సందేహం లేదు. 

స్పీకర్‌ కాక ముందు వరకు ప్రస్థానమిలా.. 

నేను కలలను నమ్మను. వాస్తవిక దృక్పథంతో రాజకీయాల్లో కొనసాగాలన్నదే నా లక్ష్యం. మూ డు సార్లు వరుసగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో ఉండకూడదు. కానీ ప్రజా జీవితంలో కొన్ని లక్ష్యాలు, ఆశయాల కోసం పనిచేయాలే తప్ప గెలుపోటములకు భయపడకూడదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే లక్ష్యం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడటమే నా స్టైల్‌. జనాలకు సేవ చేసేందుకే నాడు జగన్‌మోహన్‌రెడ్డి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాను. రాజశేఖర్‌రెడ్డి బతికున్న సమయంలోనే పలు మార్లు పార్టీలో చేరాలని కోరితే సమయం వచ్చినప్పుడు చేరుతాం సార్‌ అని అన్నాను. నేనొక్కడినే కాదు సార్‌ నా వెంట ఉన్న కేడర్, బంధువులు, బలగం అంతా నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పాను. సీతారాం చేరాడం టే ఓ స్థాయిలో ఉండాలన్నదే నా ధ్యేయం అని చెప్పా. అయితే ఆయన సరదాగా ఓ మాట అన్నారు. ‘రచ్చబండకి వచ్చేటప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తా అప్పుడు చేరాలి.... ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తా’నని  జోక్‌ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగానే చనిపోయారు. ఆ మహానుభావుడు అడిగారు వెళ్లలేకపోయానని బాధపడేవాడిని. ఆయన బాటలోనే నడుస్తూ, ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్న వ్యక్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని నమ్మి పనిచేశాను. పార్టీలో చేరినప్పటి నుంచి జగన్‌ చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేశాను. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నన్ను పిలిచి శాసనసభాపతిగా ఉండాలని కోరితే సరేనని అంగీకరించాను.

మరిన్ని వార్తలు