చంద్రబాబు రాజధాని పర్యటనకు నిరసనగా భారీగా ఫ్లెక్సీలు

28 Nov, 2019 08:43 IST|Sakshi

చంద్రబాబు దళిత ద్రోహి: రాజధాని రైతులు

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు నిరసనగా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, రైతు కూలీల పేరుతో నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. కృష్ణానది కరకట్ట నుంచి రాయపూడి వరకూ వెలిసిన ఈ ఫ్లెక్సీల్లో చంద్రబాబుకు రాజధాని రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని పేరుతో రైతులను మోసం చేసి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తున్నారంటూ ఫ్లెక్సీల్లో రైతులు ప్రశ్నించారు. ‘చంద్రబాబు రాజధాని పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్‌ చూపించి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు. రాజధాని పేరుతో మీరు చేసిన మోసానికి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాజధాని రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టాలి.
 

చదవండి: రాజధాని రైతులకు బాబు శఠగోపం

రాజధాని ప్రజలకు మీరు ఇస్తానన్న ఉచిత విద్య హామీ అమలు చేశారా? ఇస్తానన్న ఉచిత వైద్యం ఎందుకు ఇవ్వలేదు? గ్రామ కంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? యువతకు ఉపాధి కోసం ఇస్తానన్న రూ.25 లక్షల వడ్డీలేని రుణం హామీ మీకు నాలుగేళ్లు గుర్తుకు రాలేదా? రాజధానిలో రైతు కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 365 రోజులు పని కల్పిస్తామని ఎందుకు రైతు కూలీలను మోసం చేశారు? రాజధాని రైతులకు మీరు కేటాయించిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి? మూడేళ్లలో అంతర‍్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? జీవో నెంబర్‌ 41 జారీ చేసి అసైన్డ్‌ భూములను సాగు చేస్తున్న దళితులకు ఎందుకు అన్యాయం చేశారు? దళిత ద్రోహి చంద్రబాబు. మీ ఆస్తులు కాపాడుకోవడం, మీ రాజకీయాల కోసం రాజధానిని రాజకీయం చేయొద్దు. మరోసారి మా జీవితాలతో ఆడుకోవద్దు చంద్రబాబు’... అంటూ ప్రశ్నలతో నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కాగా రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో వారికిచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేదు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 28,054 మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను అప్పటి ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా సేకరించింది.

చదవండిఅప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం 

మరిన్ని వార్తలు