ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: మరో ఐదుగురిపై సీఐడీ కేసు!

8 Feb, 2020 11:52 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అడిషనల్‌ డైరెక్టర్‌ పీవీ సునీల్‌ కుమార్‌ అమరావతి అసైన్డ్‌ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్‌ కమిషనర్‌కు శనివారం లేఖ రాశారు. లేఖతో పాటు 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  106 మంది అసైన్డ్‌ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల వివరాలు, భూముల సర్వే నెంబర్లు, అడ్రసుతో సహా పూర్తి వివరాలను ఎక్సెల్‌ షీట్‌లో చీఫ్‌ కమిషనర్‌కు లేఖతో పాటే పంపించారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌; ఏడుగురిపై కేసు

కాగా 2018-2019 మధ్య జరిగిన అసైన్డ్‌ భూముల కొనుగోలు ట్రాన్సాక్షన్లపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. కాగా ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదుగురిపై  సీఐడీ కేసు నమోదు చేసింది.

మరిన్ని వార్తలు