నీతి ఆయోగ్‌ సాక్షిగా బాబు బండారం బట్టబయలు!

17 Jun, 2018 12:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నాలుగో సమావేశం సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు లాలూచీ రాజకీయం మరోసారి బయటపడింది. అమరావతిలో కూర్చొని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసే బాబు, ఢిల్లీలో మాత్రం ఆయనను ప్రసన్నం చేసుకొనేందుకు వంగి షేక్‌హ్యాండ్‌లు ఇచ్చారు. నాలుగేళ్ల పొత్తును కాదని బీజేపీ నుంచి టీడీపీ వైదొలగిన సంగతి తెలిసిందే. అనంతరం ఇరు పార్టీల నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదన్న నెపంతో చంద్రబాబు.. బీజేపీ, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు కూడా చేశారు. వరుస విమర్శలు, ప్రతి విమర్శలు నేపథ్యంలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా చంద్రబాబు, ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం.

బీజేపీపై కత్తులు దూసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇరువురు నేతలు పరస్పరం చేతులు కలుపుతూ ముసిముసిగా నవ్వుకున్నారు. అనంతరం కొద్దిసేపు ఇరువురు ప్రత్యేకంగా సమావేశం అయినట్లు సమాచారం. ఏపీకి జరిగిన అన్యాయానికి కేంద్రాన్ని నిలదీస్తానన్న బాబు, తీరా సమావేశం సమయం వచ్చేసరికి ఉసూరుమనిపించారు. ఏపీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లలేకపోయారు.

ఏం చేసినా, జరిగినా అంతా తానే చేశానని చెప్పుకొనే బాబు, ఆదివారం కూడా అదే కలరింగ్‌ ఇచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్‌కు మద్దతుగా ఇతర ముఖ్యమంత్రులు వస్తే.. దాన్ని కాస్తా తన గొప్పగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. కేజ్రీవాల్‌ నిరాహార దీక్ష చేస్తూ నలుగురు ముఖ్యమంత్రుల మద్దతు కూడగడితే.. చంద్రబాబు మాత్రం ఏపీ సమస్యలపై ఇతర సీఎంల మద్దతు కూడగట్టలేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు