మూడు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ పథకం : సీఎం జగన్‌

30 Aug, 2019 13:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాగునీటి సరఫరా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన పనుల్ని వారికి పలు సూచనలు చేశారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని అధికాలకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో.. రెండోదశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో... ఇక మూడోదశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో శుభ్రమైన తాగునీటిని అందించాలని స్పష్టం చేశారు. 

నీటిని తీసుకున్న చోటే శుద్దిచేసి అక్కడ నుంచే సరఫరా చేయాలని సీఎం ప్రాథమికంగా నిర్ణయించారు. కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌ నుంచి నేరుగా ఇళ్లకే తాగునీరు పంపిణీ చేయాలని చెప్పారు. ఈ అంశాలపై నిశిత అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను పరిగణలోకి తీసుకుని.. వాటిల్లో తాగునీటిని నింపిన తర్వాత అవి కలుషితం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఆలోచనలు చేయాలని సీఎం జగన్‌ సూచిం‍చారు. సమీక్షా కార్యక్రమంలో  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు