సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్ర సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలను వివరించడంతోపాటు రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిందిగా విన్నవిస్తారు. ప్రధానితోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తెస్తారు. వీరితోపాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కూడా సీఎం వైఎస్ జగన్ కలిసే అవకాశం ఉంది. శాసనసభ ఫలితాలు వెలువడ్డాక మే 26న, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జూన్ 19న ఢిల్లీ వెళ్లినా కొన్ని గంటలు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారు. ఇప్పుడు తొలిసారిగా ప్రధాని, మంత్రులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.