ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

5 Nov, 2019 15:23 IST|Sakshi

మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కోకు కేటాయించాలని విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌కు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత  బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని ప్రధానికి వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

లేఖలోని అంశాలు: రాష్ట్రంలోని ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల సామర్ధ్యం 5010 మెగావాట్లు. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ నుంచే సరఫరా అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్‌ కాలరీస్‌ను తెలంగాణకు కేటాయించారు. కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీనివల్ల రాష్ట్ర విద్యుత్‌ రంగంలో భరోసా లేకుండా పోయింది. ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఈ పరిస్ధితి తీవ్ర అవరోధంగా మారింది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. ఐబీ వ్యాలీ, మరియు తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయి.  ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు. వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీ కి కేటాయించారు. ప్రతీ గని నుంచి 5ఎంఎంటీఏలు తీసుకోవచ్చని చెప్పారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణా వ్యయం చాలా అధికంగా ఉంది.

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు గనుల చట్టం–2015 ప్రకారం ట్రాంచీ–6ను ఏపీజెన్‌కో వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. పై అంశాన్ని పరిగణలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వశాఖకు ఏపీజెన్‌కో దరఖాస్తు చేసుకుంది. మార్చి 2020 నాటికి ఏపీ జెన్‌కో తన థర్మల్‌ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు సిద్ధమవుతోంది. ఈ అదనపు విద్యుత్‌ తయారీకోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం ఉంది. అంతేకాక ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరాచేయాల్సి ఉంది. మందానికిని ‘‘ఎ’’ కోల్‌ బ్లాక్, తాల్చేరు కోల్‌ఫీల్డ్, అంగుల్‌ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మందాకిని కోల్ బ్లాక్ ను ఏపీజెన్ కోకు కేటాయించాలని కోరుతున్నాం. కేంద్ర బొగ్గుశాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్‌కోకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా’మని లేఖలో  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు