అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ

26 Aug, 2019 19:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సీఎం జగన్‌.. అనంతరం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో కలిసి హోం మంత్రి అమిత్‌ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. 

(చదవండి : సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు)

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్టంలో అమలు చేయాల్సిన పలు పెండింగ్‌ అంశాలపై కూడా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర ఉదారంగా నిధులు విడుదల చేయాలని కోరారు.

జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ
అమిత్‌ షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం, పోలవరంతో పాటు పలు నీటి పారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకే పోలవరంపై రీటెండరింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రికి వైఎస్‌ జగన్‌ వివరించారు. సమావేశానంతరం మంత్రి షెకావత్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు