కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

29 Apr, 2020 14:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: మత్స్యకారులు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత వారికి రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 నివారణ చర్యలు, ప్రభావిత రంగాల పరస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను తిరిగి స్వస్థలాలకు తీసుకు వస్తున్న అంశం గురించి సీఎం జగన్‌ వివరాలు కోరగా...  4,065 మందికి పైగా స్వస్థలాలకు బయల్దేరారని అధికారులు వెల్లడించారు. రవాణా ఖర్చులు, భోజనం, దారి ఖర్చులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కాగా క్యాంపు కార్యాయలయంలో జరిగిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితర అధికారులు హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించారు. (చదువే ఆస్తి.. నాదే పూచీ)

రాష్ట్రంలో నమోదైన కేసులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష
గడచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. గుంటూరులో నమోదైన 29 కేసుల్లో 27 కేసులు నర్సరావుపేటకు చెందినవేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున కంటైన్‌మెంట్‌ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ శాతం 1.51 అయితే, దేశవ్యాప్తంగా పాజిటివిటీ కేసులు 3.84శాతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికితీసుకువచ్చారు. ఇక గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు నిర్వహించామని... ఇందులో 70శాతం వరకూ పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశామని తెలిపారు. ఇప్పటివరకూ 88,061 కరోనా టెస్టులు, ప్రతి మిలియన్ జనాభాకు 1649 పరీక్షలు చేశామన్నారు. (కష్టకాలంలో ‘పవర్‌’ రికార్డ్‌)

అదే విధంగా క్లస్టర్ల వారీగా కూడా వెరీ యాక్టివ్,  యాక్టివ్, డార్మంట్‌  క్లస్టర్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. గడచిన 5 రోజుల్లో కేసులు నమోదైన క్లస్టర్లను వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా పరిగణిస్తున్నామని తెలిపారు. వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 76.... 5 నుంచి 14 రోజులుగా కేసులు లేని యాక్టివ్‌ క్లస్టర్లు 55... 14 నుంచి 28 రోజులుగా కేసులు లేని డార్మంట్‌ క్లస్టర్లు  73... 28 రోజుల నుంచి కేసులు లేని క్లస్టర్లు 13 ఉన్నాయని వెల్లడించారు. కరోనాను మరింత సమర్థవంతంగా కట్టడి చేయడం కోసం ఈ విశ్లేషణను కలెక్టర్లకు అందిస్తామని పేర్కొన్నారు.

ఇక శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభమైనట్లు అధికారు సీఎం జగన్‌కు తెలిపారు. ఒంగోలులో ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలుకూడా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. అదే విధంగా... నెల్లూరులో కూడా ల్యాబ్‌ ఏర్పాటు ముమ్మరంగా సాగుతోందని పేర్కొన్నారు. శనివారం నాటికి ఈ మూడు కొత్త ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకూ 8 జిల్లాల్లో 9 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయన్న అధికారులు... ఇవికాక ప్రతి ఏరియా ఆస్పత్రి, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సుమారు 50 చోట్ల ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయన్నారు. డీఆర్డీఓతో మాట్లాడి మొబైల్‌ ల్యాబ్‌ను కూడా తయారు చేయిస్తున్నామని వెల్లడించారు.(రికార్డు పరీక్షలు)

టెలిమెడిసిన్‌ పరీక్షపై సీఎం నిశిత సమీక్ష
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం టెలిమెడిసిన్‌కు కాల్‌ చేసిన వారికి అదే రోజు మందులు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. టెలిమెడిసిన్‌ వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలు చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని పేర్కొన్నారు. మందులు చేరాయా? లేదా? అన్న అంశాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాకు ఏర్పాటు చేస్తున్న ముగ్గురు జేసీల్లో ఒకరికి ఈ పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. టెలిమెడిసిన్‌కు సంబంధించి సరైన ఎస్‌ఓపీని రూపొందించుకోవాలని సూచించారు. పూర్తిస్థాయిలో దృష్టిసారించి... టెలిమెడిసన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షల నిర్వహణపై సీఎం జగన్‌ ఈ సందర్భంగా ఆరా తీశారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 12,247 పరీక్షలు చేశామని అధికారులు ఆయనకు తెలిపారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పరీక్షలు చేయాలని సీఎం వారిని ఆదేశించగా... మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్న అధికారులు పేర్కొన్నారు.

రైతులను ఆదుకోవాలి....
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో గత ఏడాదితో పోలిస్తే ఏ పంటలోనైనా రైతుల వద్ద నుంచి ఎక్కువే కొనుగోలు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎప్పుడూ కొనుగోలు చేయని మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయని అధికారులు అన్నారు. ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతిద్వారా కొనుగోలు తదితర చర్యలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో అరటి, టొమాటో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ సూచించారు. చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలన్నారు. గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వాటి ద్వారా కూరగాయలను పంపిస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెడ్‌జోన్లకు చేరువగా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగాలని సీఎం ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు