విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

10 Aug, 2019 18:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నిచర్, పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులు, బ్లాక్‌బోర్డ్స్‌ కార్యక్రమాలతో పాటు అదనపు తరగతి గదులను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 98 శాతం అంటే సుమారు 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీసిన విద్యాశాఖ దాదాపు 10.88 లక్షల ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.



అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ప్రజలముందు ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కొన్నిచోట్ల అన్ని తరగతులకూ ఒకే టీచర్‌ ఉన్నారన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్‌ ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు