ప్రధాని మోదీతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

2 Apr, 2020 12:23 IST|Sakshi

సాక్షి, అమరావతి : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వారికి తెలిపారు. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం వివరించారు. ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 111 కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయినవారేనని వీడియో కాన్ఫరెన్స్‌ సీఎం స్పష్టం చేశారు.

‘కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాలు అనుసరిస్తోంది. 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించాం. 10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశాం. మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచాం. దీనికి తోడుగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ కోసం మరో 20వేల బెడ్లను రెడీ చేశాం. అంతేకాక క్షేత్రస్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేస్తున్నాం. రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సర్వే చేస్తున్నాం. ఢిల్లీలో తబ్లిగీ జమాతే సదస్సుకు హాజరైన వారిని క్వారంటైన్‌కు తరలించాం. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించి.. పరీక్షలు నిర్వహించి, మంచి వైద్యం అందిస్తున్నాం. 


వైద్య పరంగా ఇప్పుడున్న యంత్రాంగాన్ని, పరికరాలను పూర్తిస్థాయిలో మోహరిస్తున్నాం. అయితే అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడానికి టెస్టు కిట్లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ మరిన్ని కావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఈనెలలో ఇవ్వాల్సిన జీతాల్లో యాభైశాతం వాయిదా వేశాం. ఆదాయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కరోనా నివారణా చర్యలకోసం అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతోంది. ఇది దృష్టిలో ఉంచుకోవాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీని కోరారు. కాగా, ప్రధానితో సమావేశంలో సీఎం జగన్‌తో పాటు.. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు