..మీ కష్టం నాది

25 Apr, 2020 02:32 IST|Sakshi
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కష్టం కంటే అక్కచెల్లెమ్మల కష్టం పెద్దది

ఇకపై పొదుపు సంఘాల బ్యాంకు రుణాలపై వడ్డీ భారం సర్కారుదే

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడిన సీఎం 

అక్కచెల్లెమ్మలు అందరికీ ఈ పథకం కింద రూ.1400 కోట్లు ఇస్తున్నాం 

సగటున ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు లబ్ధి     

పావలా వడ్డీకే రుణాలు అని వైఎస్సార్‌ తీసుకొచ్చిన ఈ పథకం 2016లో నిలిచిపోయింది  

కరోనా వల్ల పైసా ఆదాయం రాకపోయినా అక్క చెల్లెమ్మలకు మేలు చేయాలని అమలు చేస్తున్నాం 

మనది మహిళా పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు

లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు

జూలై 8న వైఎస్సార్‌ జయంతి రోజు పంపిణీ

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. అంతే కాకుండా ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం. కరోనా లేకపోయుంటే.. ఇప్పటికే అక్షరాలా 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టిన రోజు జూలై 8న ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం.

కరోనా వల్ల ఆదాయం రాని పరిస్థితులు ఉన్నా.. అక్కచెల్లెమ్మలకు ఈ పథకం తీసుకురావడం వల్ల కాస్తో కూస్తో మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ పథకం ద్వారా 8 లక్షల 78 వేల గ్రూపుల్లోని 91 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. ప్రతి గ్రూపునకు కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు లబ్ధి కలుగుతుంది. ప్రతి ఏటా ఈ పథకం ద్వారా ఆ మేరకు లబ్ధి పొందుతారు. 

రూపాయి పైచిలుకు వడ్డీ ఉన్న రుణాలను మొదట పావలా వడ్డీకే మహానేత, దివంగత సీఎం వైఎస్సార్‌  తీసుకు వస్తే.. ఆ పథకం తర్వాత సున్నా వడ్డీగా మారింది. 2016లో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు అందరికీ ఈ పథకం కింద  రూ.1400 కోట్లు ఇవ్వగలగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రం, దేశం, ఇతర దేశాలు కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కష్టపడుతున్నాయి. అయితే మీ కష్టం ఇంతకంటే పెద్దది. అందుకే ఈ కష్టకాలంలో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అండగా ఉండాలని నిర్ణయించాం. మీరు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్నంతటినీ ఇకపై ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లను పంపించారు. అనంతరం జిల్లాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.   

7 నుంచి 13 శాతం వడ్డీ భరిస్తున్నాం
► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3 లక్షల పరిమితి వరకు ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు. ఈ లెక్కన సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7 శాతం నుంచి 13 శాతం వరకు ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి.  
► ప్రతి పథకంలో అక్కచెల్లెమ్మలకే పెద్దపీట వేశాం. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు మహిళా మంత్రులు (ఒకరు డిప్యూటీ సీఎం), సీఎస్‌ స్థానంలో ఉన్న మహిళా అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
► తల్లులు, అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే పూర్తిగా సద్వినియోగం అవుతుందని నా భావన. ఫలితాలు బాగుండాలి. ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని భావిస్తున్నాం.  
 
ఇదీ మన ప్రభుత్వ ఘనత 
► 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద జనవరి 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున జమ చేశాం.  
► పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు–నేడు కింద స్కూళ్లలో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడుతున్నాం. 
► నామినేటెడ్‌ పనులు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని గొప్ప చట్టం తీసుకు వచ్చాం.  
► వక్ర బుద్ధితో అక్కచెల్లెమ్మల వైపు చూస్తే.. కఠినంగా శిక్షలు వేసేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్రపతి దీనికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం. 13 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక కోర్టులు తీసుకొస్తున్నాం. ప్రత్యేక యాప్‌ కూడా కూడా తీసుకొచ్చాం.  
► ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీసును పెట్టాం. 11 వేలకుపైగా మహిళా పోలీసులను రిక్రూట్‌ చేసి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ సచివాలయాల్లో 7 నుంచి 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశాం. బెల్టుషాపులు ఉన్నా, గృహ హింస జరిగినా.. వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.  
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో హర్షం వ్యక్తం చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు 
 
పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యం 
► ‘వసతి దీవెన’ అని ఇటీవల 12 లక్షల మందికి మేలు జరిగేలా ఓ పథకాన్ని తీసుకొచ్చాం. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజినీరింగ్‌ లాంటి ఉన్నత చదువులు చదివే వారికి రెండు దఫాల్లో రూ.20 వేలు తల్లుల అక్కౌంట్లో వేస్తున్నాం.  
► ఇదివరకెన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.1,880 కోట్లు పూర్తిగా చెల్లించడమే కాకుండా ఈ ఏడాదికి సంబంధించి దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా భారం భరిస్తూ గత నెల 31 వరకు ఉన్న ఫీజు బకాయిలు అన్నీ కలిపి దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా వచ్చే మంగళవారం పూర్తిగా చెల్లిస్తాం. అనంతరం మూడు నెలలకు సంబంధించిన ఫీజు.. జూన్‌ నుంచి ఆగస్టు వరకు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం.  
► తద్వారా తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? కాలేజీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? అని తల్లులు చూసుకుని ఆ ఫీజులు చెల్లిస్తారు. జవాబుదారీ తనం కోసమే ఇలా చేస్తున్నాం. 
► రాబోయే కాలంలో ఇంకా మంచి పనులు చేయడానికి దేవుడి దీవెనలు ఉండాలని కోరుతున్నాను.  
► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు
జూలై 8న వైఎస్సార్‌ జయంతి రోజు పంపిణీ
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. అంతే కాకుండా ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం. కరోనా లేకపోయుంటే.. ఇప్పటికే అక్షరాలా 27 లక్షల
ఇళ్ల స్థలాల పట్టాలు రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టిన రోజు జూలై 8న ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

ఇక ఆర్థికంగా నిలదొక్కుకుంటాం
కరోనా సమయంలో కూడా బియ్యం, కందులు, శనగలు ఇచ్చారు. మా ఊళ్లో ఇంటి స్థలం విలువ రూ.20 లక్షలు. అలాంటి చోట కూడా ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత అన్నలా.. తమ్ముడిలా ఇస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేయలేదు. రుణాలు, దానిపై వడ్డీ తడిసి మోపెడైంది. ఇకపై ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. 
– కె.పద్మావతి, ఆనందపురం మండల సమాఖ్య సభ్యురాలు, విశాఖపట్నం

మా కుటుంబాల్లో గౌరవం పెరిగింది.. 
సుదీర్ఘ పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఇస్తామన్నారు. అనుకున్నట్టే మాకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్‌ పావలా వడ్డీ కింద రుణాలు ఇచ్చారు. మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం. మా కుటుంబాల్లో మాకు గౌరవం పెరిగింది. దిశ చట్టాన్ని తీసుకు వచ్చి.. మహిళలకు పూర్తి రక్షణ ఇస్తున్నారు.
– సుగుణకుమారి, మదర్‌థెరిస్సా మహిళా సంఘం సభ్యురాలు, కాకినాడ  

మరిన్ని వార్తలు