‘సీఎం జగన్‌కు గిరిజనుల పక్షాన ధన్యవాదాలు’

21 Jan, 2020 13:03 IST|Sakshi

డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు రాద్దాంతం చేయడం విచారకరమని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ప్రత్యేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.  ఈ బిల్లుపై చర్చ సజావుగా జరగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేపట్టారు. ఈక్రమంలో స్పీకర్‌ వారికి ఎంత నచ్చచెప్పినా వినలేదు. టీడీపీ నేతలు నినాదాలు చేస్తుండగానే మంత్రి పుష్పశ్రీవాణి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. దళితులకు టీడీపీ ఎంత వ్యతిరేకమో వారి నినాదాలతోనే అర్థమవుతుందన్నారు.    

‘ప్రతిష్టాత్మకమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లుపై టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు చేసేందుకే ఈ బిల్లు ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి యావత్‌ గిరిజనుల తరపున ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ కమిషన్‌ బిల్లును అడ్డుకోవాలనే కౌన్సిల్‌లో టీడీపీ ఎస్సీ వర్గీకరణ తెరమీదకు తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరగకూడదనే టీడీపీ ముఖ్య ఉద్దేశం. గతంలో ఎస్సీలుగా ఎవరైన పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్న విషయాన్ని ఓ సారి గుర్తుచేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజు తన మంత్రి వర్గంలో ఎస్సీ మంత్రిని కేబినెట్‌ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కానీ ఈ రోజు నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ వర్కుల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.  తన కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన ఏకైక సీఎంగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు’ అని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. 

చదవండి:
టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ మనస్తాపం

‘డర్టీ పొలిటీషియన్‌ అని అదే కేసీఆర్‌ అనలేదా’

మరిన్ని వార్తలు