సాక్షి, పశ్చిమ గోదావరి: స్వాత్రంత్యం వచ్చి 70ఏళ్లు దాటినా నేటికీ గిరిజన ప్రాంతాలు అభివృద్ది చెందలేదని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. జిల్లాలోని కేఆర్పురంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేస్తామని అమె తెలిపారు. గత ప్రభుత్వం కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ట్రైబల్ సబ్ప్లాన్కు రూ. 811 కోట్లు నిధులను అదనంగా కేటాయించారని మంత్రి వెల్లడించారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల అభివృద్ది జరగలేదని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన యూనివర్శిటీ, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కాలేజీలను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే 7 గిరిజన నియోజకవర్గాల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని, వచ్చిన 3 నెలలకే ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీది అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఆర్వైఎఫ్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి వెల్లడించారు.