ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే
సాక్షి, విజయవాడ: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ద్రోణ కన్సల్టెన్సీ రూపొందించిన శౌర్యం, స్మృతి పోస్టర్లను డీజీపీ గౌతం సవాంగ్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పోలీసుల విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. వాళ్ల త్యాగాలు ఎవరి దృష్టికి రాకుండా పోతుంటాయి. అయినా పోలీసులు నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తారు. సమాజం సురక్షితంగా ఉందంటే అది పోలీసుల సేవాతత్పరణ వల్లే. సంక్ష్లిష్టమైన పరిస్థితుల్లో అంచనాలకు మించి పోలీసులు విధులు ఉంటాయి. పోలీసుల విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది.
ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీస్ ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసుల్నే. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. అందరి అంచనాలకు మించి నిరంతరం నిస్వార్థ సేవ చేస్తుంటారు. మత విద్వేషాలు, అంతర్గత కలహాలు, తీవ్రవాదుల నుంచి ముప్పు, వివిధ రకాల నేరాలు, శాంతి భద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల్లో విధి నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ భద్రత లాంటి మరెన్నో సంక్లిష్టమైనవి పోలీస్ విధులు’ అని అన్నారు.