ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా

6 Jul, 2018 11:14 IST|Sakshi
గంటా శ్రీనివాసరావు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చేదు వార్త. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.

‘ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు పెట్టింది. మరిన్ని వివరాలు కావాలని అడిగింది. వాటికి సమాధానం ఇచ్చాం. త్వరలో అనుమతి రావొచ్చు. బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్‌సీటీఈ విడుదల చేసిన గెజిట్‌పై కూడా చర్చిస్తున్నాం. టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామ’ని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు.

భయపడినట్టుగానే..
ముందునుంచి అనుకుంటున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌ మరోసారి వాయిదా పడింది. జులై 6న 10,351 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అంతకుముందు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ నుంచి పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయకపోవడంతో నోటిఫికేషన్‌ వాయిదా వేయాల్సి వచ్చింది.

అభ్యర్థుల ఆవేదన
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో పాలకులు ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కోచింగ్‌ తీసుకుంటున్నామని, నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా తమను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు