కేరళలో మన అన్నదాతలు భిక్షాటన : వైస్‌ జగన్‌

25 Mar, 2017 10:15 IST|Sakshi
కేరళలో మన అన్నదాతలు భిక్షాటన : వైస్‌ జగన్‌

అమరావతి:  ఉపాధి హామీ నిధులను ఉపాధి సృష్టించేందుకు వాడకపోవడంతో కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. శనివారం  శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ పనుల్లో లేబర్‌ కాంపోనెంట్‌ను (కార్మికుల వ్యయాన్ని) తగ్గించి మెటీరియల్‌ కాంపోనెంట్‌ను పెంచుతున్నారన్నారు.

లేబర్‌ కాంపోనెంట్‌ను తగ్గించడం వల్ల పనులు లేక కూలీలు ఉపాధి కోసం కేరళ, కర్ణాటక, చెన్నైకి వలస పోతున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే మన రాష్ట్రానికి చెందిన అన్నదాతలు కేరళలో భిక్షాటన చేస్తున్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 97.5 శాతం ఉపాధి హామీ నిధులను లేబర్‌ కాంపోనెంట్‌కే వినియోగించారని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, సిమెంట్‌ రోడ్లు, శ్మశానాల నిర్మణానికి ఈ నిధులు ఖర్చు పెడుతోందని వైఎస్‌ జగన్‌ అన్నారు. సిమెంట్‌ పనులు పెరగడం వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందని..మెటీరియల్‌ కాంపోనెంట్‌ను ఎక్కువ పెట్టడం వల్ల అవార్డులు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. కానీ పేదల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.