38 మండలాలు.. 15,344 క్లస్టర్లు

21 Aug, 2019 08:21 IST|Sakshi

నాణ్యమైన బియ్యం సరఫరాకు ముమ్మర ఏర్పాట్లు

ఒక క్లస్టర్‌లో బియ్యం పంపిణీకి రూ.383 ఖర్చు

తూర్పు గోదావరి నుంచి బియ్యం దిగుమతి

ఈ నెల 28కి ఎఫ్‌పీ షాపులకు అందజేత  

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పేదల విందు పరి పూర్ణం కానుంది. తెలుపు రంగు రేషన్‌కార్డు గల పేదలకు పౌర సరఫరాల విభాగం ద్వారా నా ణ్యమైన బియ్యాన్ని ఇంటికే తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ బృహత్తర కార్యక్రమం తొలి విడత లబ్ధిదారుల జాబితా లో మన జిల్లా కూడా ఉంది. రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తొలి దశ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వలంటీర్లకు క్లస్టర్ల ఏర్పాటు, వారి రేషన్‌ కార్డుల అనుసంధానం, బియ్యం సరఫ రా చేసేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవడం, వాటికి రవాణా ఖర్చులు అంచనా వేయడం వంటి చర్యలతో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన పనులు సుమారుగా 90 శాతం వరకు పూర్తి చేశారు. అక్కడక్కడా ట్రయల్‌ రన్‌ కూడా చేస్తున్నారు. లోపాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఒకటో తేదీ నాటికి సజావుగా పంపిణీ జరిగేలా కలెక్టర్‌ నివాస్, జేసీ శ్రీనివాస్, సివిల్‌ సప్లై, డీఎస్‌ఓ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

15,344 క్లస్టర్ల ఏర్పాటు..
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు, ఇతర గ్రామ పంచాయతీలు, నగర పాలక, పురపాలక సంస్థలను కలిపి 15,344 క్లస్టర్లుగా విడదీశారు. ఒక్కో క్లస్టర్‌కి 50 నుంచి 60 కుటుంబాలను చేర్చారు. ఒక్కో క్లస్టర్‌లో ఒక్కో వలంటీర్‌ సేవలు అందిస్తారు. ఇప్పటికే నియమితులైన వలంటీర్లు ఆయా క్లస్టర్లలో కుటుంబాలను పరిచయం చేసుకునే కార్యక్రమం పూర్తి చేశారు. అలాగే వారి కార్డులు, క్లస్టర్‌ వలంటీర్‌ లాగిన్‌కి మ్యాపింగ్‌ కూడా చేస్తున్నారు. ఈ పనిలో ఇప్పటికే 96 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన శాతాన్ని ఈ గడువులో పూర్తి చేయనున్నారు.

 పంపిణీ వ్యయం సగటున రూ.383: 
ప్రభుత్వం పేదలకు అందజేసే నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చాలం టే గతంలో కంటే కొంత ఖర్చు పెరుగుతుంది. అయినా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పేదలకు  అందించేందుకు ఆర్థిక భారాన్ని లెక్క చేయడం లేదు. ఈ సరుకులు అందించేందుకు సగటున రూ.383 ఖర్చవుతుంది. ఇప్పటి వరకు చేస్తున్న హమాలీలు బియ్యంను గోదాముల్లో లోడ్‌ చేయ డం, అన్‌లోడ్‌ చేయడం, ఎఫ్‌పి షాపులకు తరలించడం కోసం ఒక్కో ప్రక్రియకు రూ.9లు వంతున ఖర్చు చేసేవారు. అయితే ఈ ప్రకియతోపాటుగా అదనంగా క్లస్టర్లలో వాహనాలకి ఇచ్చే ఖర్చు పెరిగింది.  గిరిజన ప్రాంతాల్లో కొండకోనల్లో ఉన్న గూడేలకు ఈ నాణ్యమైన బియ్యాన్ని సరఫరాలకు మరికాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రతి నెల ఈ వాహనాల ఖర్చు సుమారుగా రూ. 58,76,980గా ఉండబోతోంది.

నాణ్యమైన బియ్యం.. 
ఇప్పటివరకు పౌర సరఫరాల ద్వారా ఎఫ్‌పీ షాపులకు, అక్కడ నుంచి తెల్లకార్డుల లబ్ధిదా రులకు అందజేసే బియ్యం అధికంగా 25 శాతం కంటే ఎక్కువగా నూకలు, తవుడు చెత్తతో కూడి ఉండేది. వీటిలో నాణ్యత తక్కువగా ఉండేది. అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందజేసే నాణ్యమైనబి య్యంలో ఈ నూకల శాతం చాలా తక్కువగా ఉంటుంది. బి య్యం కంప్యూటర్‌ మెజర్‌ ప్రకారం సార్ట్‌ చేసిన బియ్యాన్ని సరఫరా చేయనున్నారు.

తూర్పు గోదావరి నుంచి బియ్యం దిగుమతి.. 
నాణ్యమైన బియ్యం మనకు కావాల్సిన స్థాయిలో స్థానికంగా లభ్యం లేనందున, తొలి విడతలో మన జిల్లాకు కావల్సిన 13,242 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, కాకినాడ, రామచంద్రాపురం, మండలపేట తదితర ప్రాంతాల్లోని సుమారుగా 300 రైస్‌ మిల్లులను నుంచి ఈ నాణ్యమైన బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ బియ్యం అక్కడ సిద్ధంగా తూనికలు, ప్యాకింగ్‌ ను పూర్తి చేసుకొని ఉంది. ఈ నెల 28వ తేదీ నాటికి జిల్లాకు చేర్చడానికి జిల్లా యంత్రాగం అన్ని చర్యలు సిద్ధం చేసింది. 

నేరుగా ఎఫ్‌పీ షాపులకే బియ్యం.. 
సెప్టెంబర్‌ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యాన్ని తెలుపు రంగు కార్డుదారులకు అందజేయనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ నెల 28 నాటికి తూర్పు గోదావరి జిల్లా నుంచి నాణ్యమైన బియ్యం జిల్లాకు చేరుతోంది. ఈ బియ్యం ప్యాకెట్‌ నేరుగా గ్రామాల్లోని ఎఫ్‌పీ షాపుల డీలర్లు గోదాములకు చేర్చుతున్నారు. అక్కడ నుంచి వలం టీర్లు డోర్‌ టు డోర్‌గా లబ్ధిదారులకు అందజేస్తారు. 
– జి.నాగేశ్వరరావు, డీఎస్‌ఓ, శ్రీకాకుళం

>
మరిన్ని వార్తలు