మద్యం విచ్చలవిడి అమ్మకాలకు చెక్‌

18 Aug, 2019 08:36 IST|Sakshi

సిండికేట్లపై సర్కారు పిడుగు

దశలవారీ నిషేధానికి శ్రీకారం

తొలిదశలో జిల్లాలో 81 షాపులకు మంగళం

మిగిలిన షాపులు కూడా  ప్రభుత్వ ఆధ్వర్యంలోనే

నిర్వహణకు సిబ్బంది  నియామకానికి సన్నాహాలు 

పేదల బతుకుల్లో వెలుగు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యానికి బానిసలుగా మారుతున్నవారి జీవన ప్రమాణాలు మరింత దిగజారకుండా ముందడుగు వేస్తోంది. కేవలం మూడు నెలల పాలనలో బెల్ట్‌ దుకాణాలను, కల్తీ మద్యం, నాటు సారా వ్యాపారాలను సమర్థవంతంగా నియంత్రించిన ప్రభుత్వం తాజాగా మద్యం విచ్చలవిడి అమ్మకాలను అడ్డుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. 

విశాఖ సిటీ: మద్యం విక్రయాలను ఇక ప్రభుత్వమే చేపట్టనుంది.  అక్రమ వ్యాపారంతో పాటు కల్తీని పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేయనుంది. విడి మద్యం అమ్మకాలకు  చెక్‌ పెట్టనుంది. మద్యం దుకాణాల వద్ద తాగే అవకాశం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కూడా సాధ్యపడుతుంది. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్న పథకాల్లో పొందుపరిచిన మద్యపాన నిషేధం వైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నూతన మద్యం పాలసీకి రంగం సిద్ధం చేసింది. ఈ పాలసీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 20 శాతం దుకాణాలు తగ్గించనున్నారు. తద్వారా జిల్లా, నగరంలో ప్రస్తుతం ఉన్న 401 మద్యం దుకాణాల సంఖ్య 320కి తగ్గుతుంది. ఇందులో 42 మద్యం దుకాణాలను (గతేడాది రెన్యూవల్‌ చేయించుకోలేదు) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నారు.

మిగిలిన 278 దుకా ణాలు అక్టోబర్‌ నుంచి మొదలవుతాయి. ఆయా దుకాణా లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెవరేజస్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ద్వారా ఏర్పాటవుతాయి. వీటిని నడిపేందుకు జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేస్తుంది. మొ త్తం 320 దుకాణాల్లో 1520 మంది సిబ్బం దిని నాలుగు విభాగాల్లో ఏడాది కాల పరిమి తికి అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమిస్తా రు. నగర పరిధిలోని ఒక్కో దుకా ణానికి ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్లు, ఒక సెక్యూరిటీగార్డు, జిల్లాలో దుకాణానికి ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్లు, ఒక గార్డుకు ఉపాధి కల్పి స్తారు. రిక్రూట్‌మెంట్‌ కోసం  ఎక్సైజ్‌ కమి షనర్‌ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ ఎక్సైజ్‌ కమిషనర్‌ శని వారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

‘బెల్ట్‌’పై ఉక్కుపాదం..
అయితే రాష్ట్రంలో నూ తన ప్రభుత్వం ఏర్పడిన తరువాత మ ద్యం అమ్మకాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యంగా మూడు నెలల పాలనలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేలు పైచీలుకు మద్యం బెల్ట్‌ దుకాణాలను పూ ర్తిగా నిర్మూలించారు. కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. నాటుసారా బట్టీల పనిపట్టారు. సిండికేట్‌ ఆటకట్టించారు. మద్యాన్ని జనవాసాలకు దూరం చేయడంలో దాదాపు ప్రభుత్వం చాలావరకు సఫలీకృతమైంది. మరో నెల రోజుల తరువాత మద్యం అమ్మకాలు పూర్తిగా గాడిలో పడతాయి.

సమయం ఉండదు మిత్రమా..
మరోవైపు మద్యం అమ్మకాల సమ యం విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మా ర్గదర్శకాలు జారీ చేసిం ది. ఏపీఎస్‌బీసీఎల్‌ అవుట్‌లెట్‌ ద్వారా అమ్మకాలు ఉద యం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మా త్రమే నిర్ణయించారు. ఇదివరకు ఈ సమ యం ఉదయం 10 నుంచి రాత్రి 10 గం టల వరకు ఉండేది. జిల్లా వ్యాప్తంగా ఈ నెలా ఖరున ప్రారంభం కానున్న 42 దుకాణాలకు ఈ సమయం వర్తించగా..అక్టోబర్‌ నుంచి అన్ని దుకాణాలకు వర్తింపజేస్తారు.

మెరిట్‌ ద్వారా ఉద్యోగం..
సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సూపర్‌వైజర్‌ పోస్టుకు డిగ్రీ అర్హత కాగా సేల్స్‌మెన్‌కు ఇంటర్మీడియట్‌ అర్హత. గార్డుకు నామమాత్రపు విద్యార్హతను నిర్ణయించారు. సూపర్‌వైజర్‌కు రూ.17,500, సేల్స్‌మెన్‌కు రూ.15 వేలు వేతనం ఇవ్వనున్నారు. ఏడాది కాల పరి మితికి గాను వీరిని అవు ట్‌ సోర్సింగ్‌ ద్వా రా పరీక్షలో మె రిట్‌ సాధించిన వారికి ఉపాధి కల్పిస్తూ పారదర్శకంగా నియామకం జరుపుతా రు. మొత్తం 400 మంది సూపర్‌వైజర్లు, 800 మంది సేల్స్‌మెన్లు, గార్డులను తీసుకుంటారు. వీరి పనితీరు బాగుంటే మరో ఏడాదికి ఒక నెల వేతనం బోనస్‌గా అందిస్తూ కొనసాగిస్తారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో వీరి నియాకాలు చేపడతారు. ఏపీఎస్‌బీసీఎల్‌ మేనేజర్‌ సారధ్యం వీరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 25.

టెండర్లకు నేడే ఆఖరు..
ఏపీఎస్‌బీసీఎల్‌ అవుట్‌ లెట్‌ల నిర్వాహణకు దుకాణాలను అద్దెకు తీసుకునేందుకు ప్రస్తుతం జరుగుతున్న టెండర్ల ప్రక్రియ గడువు ఆదివారంతో ముగియనుంది. ఆసక్తి గల ప్రస్తుత మద్యం దుకాణాల యజమానుల నుంచి టెండర్లు స్వీకరించేందుకు జిల్లా/నగరంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ టెండర్‌ బాక్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం వరకు ఆయా బాక్సుల్లో టెండర్‌ పత్రాలు వేసి పూర్తి వివరాలను ఆయా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు తెలియజేయవచ్చు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన టెండర్లను ఈ నెల 20 జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో తెరిచి తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భవనాలతో పాటు ఫర్నిచర్‌ ఇతర అవసరమైన సామగ్రిని అద్దెకు తీసుకుంటారు. 

టీడీపీ హయాంలో బతుకులు బుగ్గి..
గత ప్రభుత్వంలో మద్యం పాలసీ అస్తవ్యస్తంగా సాగింది. బడి–గుడి రోడ్డు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలకు అనుమతులు జారీ చేశారు. దాంతోపాటు బెల్ట్‌ దుకాణాలకు పూర్తిగా సహకరించి లైసెన్స్‌ దుకాణాల నుంచే మద్యం సరఫరా చేసేవారు. దీంతో మద్యం జనవాసాల్లో ఏరులై పారేది. దీంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు మద్యానికి బానిసలుగా మారి ఒళ్లు–ఇళ్లు గుల్ల చేసుకునే దుస్థితి వచ్చింది. ముఖ్యంగా కుటుంబ పెద్దలతో పాటు యువకులు కూడా మద్యానికి బానిసలు కావడంతో జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతోపాటు మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు కోకొల్లలు. ప్రభుత్వాదాయం కోసం మద్యం అమ్మకాల్లో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడంతో పేదమధ్య ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇష్టానుసారం ధరలు పెంచేసి ఎమ్మార్పీ నిబంధనలకు తూట్లు పొడిచి మందుబాబుల జేబులకు చిల్లు పెట్టారు. 

‘పర్మిట్‌’ లేదు..
ప్రస్తుతం లైసన్స్‌ మద్యం దుకాణం వద్ద ప్రత్యేక రుసుం ద్వారా పర్మిట్‌ రూములకు అనుమతి ఇచ్చేవారు. దీంతో దుకాణం కాస్త బార్‌గా మారి అక్కడే మందుబాబులు మద్యం సేవించేవారు. సమయం మించిపోయినా అక్కడే తిష్ట వేసి పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారింది. లూజ్‌ అమ్మకాలు యథేచ్ఛగా సాగేవి. అయితే తాజాగా మద్యం పాలసీ ద్వారా ఆయా పర్మిట్‌ రూమ్‌లకు ఇకపై అనుమతి ఇవ్వబోరు. దుకాణంలో కేవలం అమ్మకాలు మాత్రమే జరుపుతారు. షాపు చుట్టుపక్కల ఎక్కడా మద్యపానం చేయడానికి వీలు లేదు.

నిరుద్యోగులకు బాసటగా..
-నాలుగు విభాగాల్లో ఏడాది కాల పరిమితికి అవుట్‌ సోర్సింగ్‌ విధానం
-ఒక్కో షాపునకు ఓ సూపర్‌ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్లు, ఓ సెక్యూరిటీ గార్డు
-సూపర్‌వైజర్‌కు : 17,500 వేతనం
-సేల్స్‌మన్‌కు : 15,000
-మొత్తం సూపర్‌వైజర్లు : 400 మంది
-సేల్స్‌మన్లు : 800 మంది
-సెక్యూరిటీ గార్డులు : 320 మంది
-దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 25

వైన్‌ షాపుల వివరాలు..
-జిల్లాలో ఉన్న మద్యం షాపులు : 401
-కొత్త పాలసీ ప్రకారం తగ్గనున్నవి : 81
-గతేడాది రెన్యువల్‌ చేయించుకోలేని మద్యం షాపులు : 42
-అక్టోబర్‌ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే షాపులు : 42
-వీటి మోనటరింగ్‌కు కమిటీ సభ్యులు : ఐదుగురు

పారదర్శకంగా ప్రక్రియ..
నూతన మద్యం పాలసీ విధానంపై పూర్తి కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం సూచించిన కమిటీలో కలెక్టర్‌ సారధ్యంలో ఐదుగురు సభ్యుల బృందంతో పాటు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్‌ ప్రక్రియతో పాటు సిబ్బంది నియామకం కూడా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు 42 అవుట్‌లెట్‌లు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. మిగిలిన దుకాణాలు అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతాయి. దుకాణాల సమయం గంట తగ్గించడంతో పాటు పరిమిట్‌ రూమ్‌ల అనుమతిని రద్దు చేస్తాం. నూతన మద్యం పాలసీ వలన ప్రజల బతుకులు మారుతాయని ఆశిస్తున్నాం.               

టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్, ప్రోహిబిషన్‌ శాఖ 
డెప్యూటీ కమిషనర్, విశాఖపట్నం  

మరిన్ని వార్తలు