‘ఉద్యోగులను కించపరచడం సిగ్గుచేటు’

10 Apr, 2019 18:22 IST|Sakshi

విజయవాడ: ఉద్యోగస్తులని కించపరిచేలా ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ మాట్లాడిన మాటలని సమర్ధిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం సిగ్గు చేటని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. విజయవాడలో సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగస్తులని కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణపై ఎన్నికల సంఘంతో పాటు పీటీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పేరుతో కొందరు ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని సూటిగా ప్రశ్నించారు. ఎవరైతే ఉద్యోగస్తులకు న్యాయం చేస్తారో వాళ్లకే ఉద్యోగ సంఘాల మద్ధతు ఉంటుందని చెప్పిన వారిని టీడీపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని చెప్పారు.

డైరెక్టుగా పత్రికా ప్రకటనలు ఇస్తున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం శారు. ఎన్నికల నిర్వహణ పేరుతో కొంత మంది అధికారులు, ఉద్యోగులకు డ్యూటీలు వేసి వారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా చేస్తోన్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని పరోక్షంగా టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఉద్యోగస్తులు ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మాత్రమే విధులకు హాజరవ్వండని పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు