తిత్లీ పరిహారం పెంపు..

4 Sep, 2019 11:50 IST|Sakshi

తిత్లీ గాయాల నుంచి కొబ్బరి, జీడి రైతులకు ఉపశమనం

కొబ్బరి చెట్టుకు రూ.1500 నుంచి రూ.3వేలకు పరిహారం పెంపు

జీడికి రూ.30వేల నుంచి రూ.50వేలకి పెంపు

ఆనందం వ్యక్తం చేస్తున్న జీడి, కొబ్బరి రైతులు  

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): తిత్లీ.. ఈ మాట వింటేనే ఉద్దానం ఉలిక్కిపడుతుంది. రాకాసి గాలుల బీభత్సానికి పచ్చటి ఉద్దానం రూపురేఖలే మారిపోయాయి. కొబ్బరి, జీడి రైతుల జీవితకాలపు కష్టాన్ని క్షణాల్లో ధ్వంసం చేసే సింది. ఇంతటి కష్టం తర్వాత ఓదార్పులు మొదలయ్యాయి. అనంతరం పరిహారం చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ బాధితులకు అప్పటి ప్రభుత్వం ఇంకా పెద్ద షాక్‌ ఇచ్చింది. లబ్ధిదారుల జాబితాల్లో అనర్హుల పేర్లు చూసి తిత్లీ బాధితులకు నోట మాట రాలేదు. ఇచ్చిన పరిహారమే తక్కువ అనుకుంటే అనర్హులను చేర్చి అప్పటి చంద్రబాబు సర్కారు మరింత మోసం చేసిందని బాహాటంగానే విమర్శించారు. ఆ సందర్భంలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిహారం పెంపుపై హామీ ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1500 పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే జీడి పంటకు హెక్టార్‌కి రూ.30వేలు పరిహారం ఇచ్చేందుకు జీఓ కూడా విడుదల చేసింది.

ఈ జీవో నష్టపోయిన రైతులకు వర్తింపచేయకుండా కేవలం పసుపు చొక్కాలకే పరిమితం చేసిన సంగతి అందరికి తెలిసినదే. పూర్తిగా నష్టపోయిన రైతులకు ఈ పరిహారం సరిపోదని కనీసం ఒక్కో కొబ్బరి చెట్టుకి కనీసం రూ.3వేలు చెల్లించాలని, జీడి తోట హెక్టార్‌కి రూ.50వేలు ఇవ్వాలని అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. ఇప్పుడు ఆ డిమాండ్‌ను ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆమోదించారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం జీఓ నంబర్‌ 11ని విడుదల చేసి ఒక్కో కొబ్బరి చెట్టుకి రూ.3వేలుగా, జీడి పంట హెక్టార్‌కి రూ.50వేలుగా నిర్ధారించారు. దీంతో కొబ్బరి, జీడి రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. పెంచిన మొత్తాన్ని పార్టీలకు అతీతంగా నష్టపోయిన రైతులందరినీ అర్హులుగా గుర్తించి ఇవ్వాలన్నదే సీఎం లక్ష్యమని స్థానిక నేతలు చెబుతున్నారు.


పరిహారం పెంపు గొప్ప విషయం..
ఉద్దానం రైతుల్ని అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను పరిహారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. ఈ పెం పు జీఓ జారీ వల్ల బాధిత కొబ్బరి, జీడి రైతులకు మరికొంత ఉపశమనం లబిస్తుంది.
– వజ్జ త్యాగరాజు, రైతు, మకరాంపురం, కంచిలి మండలం

సంతోషం..
పరిహారం రూ.1500 నుం చి రూ.3వేలు, హెక్టారు జీడి మామిడికి రూ.30వేలకు బదులు రూ.50వేలు ఇవ్వడం సంతోషకరం. ముఖ్యమంగా ఎలాంటి ఆస్కారం లేక వీధిన పడిన వారు అనేక మంది పరిహారానికి నోచుకోకుండా పోయారు. అలాంటి అభాగ్యులకు సాయం అందించడం సంతోషకరం.
– రాపాక చిన్నారావు, పలాస

రెట్టించిన పరిహారం ఇవ్వడం సంతోషం..
గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి నచ్చినట్లు వ్యవహరించారు. నాయకులు పెద్ద ఎత్తున సొమ్ములను స్వాహా చేసుకున్నారు. ఒక్కో తెలుగుదేశం నాయకుడు కొబ్బరి చెట్లు లేకపోయినా రూ.లక్షల్లో పరిహారం అందుకున్నారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఇలా పరిహారం ప్రకటనకు జీఓ విడుదల చేయడం సంతోషకరం.
– బడగల సుజాత, పలాస–కాశీబుగ్గ

పాదయాత్రలో విన్నవించుకున్నాం..
జగన్‌ పాదయాత్రలో వచ్చినపుడు తిత్లీలో పడిన బాధలను, ఇబ్బందులను, కోల్పోయిన ఆస్తుల వివరాలు వెల్లడించాము. ఆయన స్పందించి ఆదుకుంటామన్నారు. అన్నదే తడువుగా ఏడాది తిరగక ముందే మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం సం తోషకరం. ఉద్దాన ప్రాంతంలో ఉన్న మేమంతా గర్వపడుతున్నాం.
– జినగ లోకేశ్వరి, తిత్లీ బాధితురాలు,  జినగలూరు, పలాస మండలం

మేలు మరువలేం..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల్లోనే తిత్లీ  తుఫానుకు నష్టపోయిన రైతుల గురించి కీలక నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. ఇప్పటికే చాలా మంది రైతులకు నష్ట పరిహారం అందలేదు.  కొబ్బరి చెట్టుకు రూ.1500లు, జీడి హెక్టారుకు రూ.2500 పెంచి జీఓ విడుదల చేసిన సీఎం మాట నిలబెట్టుకున్న నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. గతంలో  చాలా మంది అనర్హులు లబ్ధి పొందారు. ప్రస్తుతం అధికారులు పారదర్శకంగా సర్వే చేపట్టి అర్హులకు న్యాయం చేయాలి.
– మేరుగు తిరుపతి రెడ్డి, కొబ్బరి రైతు, బారువ 

మరిన్ని వార్తలు