రైతులకు వెయ్యికోట్లిస్తే చంద్రబాబుకు ఏమీ రాదని, అదే కాంట్రాక్టర్లకు ఇస్తే మాత్రం 30 శాతం కమీషన్ వస్తుందని, అందుకే వంశధార రెండోదశ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఆయన ఆపుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాలు చేసి గొడవ చేస్తారు కాబట్టి యువకులను దువ్వడానికి యూత్ ప్యాకేజి పేరుతో మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. వంశధార రెండోదశ ప్రాజెక్టు నిర్వాసితులతో శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
-
వంశధార రెండోదశ ప్రాజెక్టు అందరికీ కావాలి. 934 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 700 కోట్ల పైచిలుకు పనులు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి
-
తర్వాత చంద్రబాబు సీఎం అవ్వడానికి ముందే మరో 190 కోట్లు మళ్లీ ఖర్చుచేశారు
-
అంటే వంశధార రెండోదశ ప్రాజెక్టుకు చంద్రబాబు సీఎం అయ్యేనాటికే 870 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. మిగిలినది కేవలం 53 కోట్ల రూపాయల పనులే
-
అంటే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయిపోయాయి
-
మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసి ప్రతి రైతుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇచ్చే ఒకే ఒక్క కార్యక్రమం పెండింగులో ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఇంకా చేయలేదు
-
రైతులంటే కొంచెం ప్రేమ ఉన్నా ఒక్క ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసేవారు
-
కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం రైతుల మీద ప్రేమ లేదు
-
ఆయనకు కాంట్రాక్టర్ల మీద మాత్రం వ్యామోహం ఉంది
-
934 కోట్ల రూపాయల పనుల్లో కేవలం 54 కోట్ల రూపాయల పనులే ఆయన సీఎం అయ్యేసరికి మిగిలాయి
-
దీన్ని ఈపీసీ ప్రాజెక్టు కింద కాంట్రాక్టు ఇచ్చారు. అంటే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోతే జైలుకు కూడా పంపచ్చు
-
కానీ చంద్రబాబు కాంట్రాక్టర్లతో లాలూచీ పడి మిగిలిన 54 కోట్ల పనులను 400 కోట్లకు పెంచేశారు
-
తన పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ కూడా ఆయన బినామీగా కాంట్రాక్టులు చేస్తున్నారు
-
రేట్లు ఎందుకు పెంచారంటే.. పెట్రోలు పెరిగింది, డీజిల్, సిమెంటు, స్టీలు పెరిగాయని చెవుల్లో పూలు పెడుతున్నారు
-
కాంట్రాక్ట్ ఇచ్చే సమయానికి, ఇప్పటికి చూస్తే పెట్రోలు, డీజిల్, స్టీలు, సిమెంటు తగ్గాయి, ఇసుక ఉచితంగా ఇస్తున్నా రేట్లు ఎందుకు పెంచారని గట్టిగా ప్రశ్నించాను
-
చంద్రబాబు మాత్రం కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం విపరీతంగా పెంచేశారు
-
మరి రైతులకు ఎందుకు ప్యాకేజి పెంచలేదని ఈ రైతులే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు
-
అప్పట్లో ప్రాజెక్టు పూర్తి కావాలని దానికోసం ఆశపడి, అప్పట్లో త్యాగమూర్తులు భూములిచ్చారు.
-
వాళ్లంతా ఇప్పుడు అడుగుతున్నది ఒకటే. అప్పటి నుంచి పదేళ్లు పూర్తయినా ప్రాజెక్టు పూర్తికాలేదని, 2013కు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కావాలని అడిగితే తప్పేంటని రైతులు అడుగుతున్నారు
-
మీరు అడిగే దాంట్లో తప్పేం లేదు, రైతులకు నేను అండగా నిలబడతా
-
చంద్రబాబు సీఎం అయ్యేసరికి 97 వేల కోట్ల అప్పులున్నాయి. ఈ మూడేళ్లలో ఆ భారాన్ని 2.16 లక్షల కోట్లకు తీసుకుపోయారు
-
అంటే మూడేళ్లలో 1.18 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు.
-
బడ్జెట్ చూస్తే లక్షన్నర కోట్లు, అప్పులు 1.18 లక్షల కోట్లు.. మరి శ్రీకాకుళం జిల్లాకు వెయ్యి కోట్లు ఇచ్చి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది కదా అని అడిగినా ఆయన ఈ పనులు చేయరు
-
రైతులకు వెయ్యి కోట్లు ఇస్తే, ఆయనకు కమీషన్లు రావు.. కాంట్రాక్టర్లకు ఇస్తే 30 శాతం కమీషన్లు తీసుకోవచ్చు
-
తోటపల్లి, వంశధార ప్రాజెక్టు పనులుఎవరైనా చేశారంటే వైఎస్ మాత్రమేనని చెప్పుకోవచ్చు
-
కేవలం 10 శాతం మిగిలి ఉన్న పనులను చంద్రబాబు పూర్తి చేయకుండా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా పబ్బం గడుపుకొంటున్నారు
-
యువత ధర్నాలు చేస్తారు కాబట్టి వాళ్లను దువ్వడానికి ఏదో ఇస్తామన్నారు గానీ అవి కూడా సరిగా ఇవ్వలేదు.
-
మేమంతా భూములు కోల్పోయాం, నా పిల్లలకు వయసు తక్కువని డబ్బులు ఇవ్వకపోతే ఏ డబ్బు ఇస్తారని మహిళా రైతులు అడుగుతున్నారు
-
ఇదే శ్రీకాకుళం జిల్లాలో పక్కన 18 లక్షలు ఇస్తున్నారు, మాకు ఇల్లు లేదు, మన్ను లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు
-
చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు.. ఏడాది, ఏడాదిన్నర పోతే వచ్చేది మన పరిపాలన
-
అప్పుడు కచ్చితంగా 2013 భూసేకరణ చట్టం అమలుచేసి, మిగిలిన పరిహారం కూడా ఇస్తాం
-
ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ మేలు చేసే కార్యక్రమం చేస్తాం
-
సమస్య ఎక్కడ వస్తోందంటే, ప్రతి కుటుంబంలోను తక్కువ రేటు ఇచ్చి భూములు కొనుగోలు చేశారు
-
పక్కనే ఇదే జిల్లాలో 18 లక్షల చొప్పున అణు విద్యుత్ ప్లాంటుకు భూమి తీసుకుంటున్నారు
-
యూత్ ప్యాకేజి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ఉంది
-
మొత్తం 11 వేల కుటుంబాలకు కూడా యూత్ ప్యాకేజి అమలుచేయాలి
-
కనీసం అప్పుడైనా కొద్దో గొప్పో న్యాయం కనిపిస్తుంది.
-
మీకు నచ్చినవాళ్లకు, కమీషన్లు ఇచ్చినవాళ్లకు మాత్రమే ప్యాకేజి ఇస్తున్నారు
-
నచ్చినవాళ్లకు మాత్రమే ఇస్తూ ప్యాకేజిని అపహాస్యం చేస్తున్నారు
-
ముంపు గ్రామాలకు సంబంధించి అవస్థలు పడుతున్న ప్రజల నోట్లోంచి మాటలు విన్నాం
-
కడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయత కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా
-
న్యాయాన్ని పక్కనపెట్టి చేస్తున్న అన్యాయం కళ్లెదుటే కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు
-
చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేపడదాం
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా అండదండలు కల్పిస్తుంది
-
మీరు ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి సంఘీభావం తెలిపాను, ఇప్పుడు మరోసారి వచ్చా
-
ఎవరూ అధైర్యపడొద్దు.. చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరం మాత్రమే ఉంటుంది
-
ఆయన ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజు ముందుంది
-
కచ్చితంగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేస్తామని చెబుతున్నా
-
నష్టపోయినదానికి మీ అందరికీ ఆ చట్టం ప్రకారం నష్టాన్ని పూడుస్తాం
-
మొత్తం 11వేల కుటుంబాలకు న్యాయం జరిగేలా కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాం
-
ధైర్యంగా ఉండండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా మీకు తోడుగా ఉంటుంది.