పోలవరం కల సాకారమెలా?

16 Mar, 2017 03:10 IST|Sakshi
పోలవరం కల సాకారమెలా?

బడ్జెట్లో రూ.9 కోట్లు మాత్రమే కేటాయించిన రాష్ట్ర సర్కార్‌
కేంద్రం నాబార్డు ద్వారా రూ.6,880 కోట్ల రుణం ఇప్పిస్తుందని అంచనా!
2018 నాటికి పాక్షికంగా,2019 నాటికి పూర్తిగా ప్రాజెక్టు సిద్ధమవుతుందని హామీ


అమరావతి: రాష్ట్రానికి వర ప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.9 కోట్లను మాత్రమే కేటాయించింది. అయితే కేంద్రం.. నాబార్డు నుంచి రూ.6,880 కోట్లను రుణంగా ఇప్పిస్తుందని అంచనా వేసింది. కానీ గతేడాది డిసెంబర్‌ 26న నాబార్డు ద్వారా వచ్చిన రూ.1,981.54 కోట్ల వినియోగానికి సంబంధించిన వినియోగపత్రాలు పంపితేనే కేంద్రం మరో దఫా రుణం ఇప్పించే అవకాశం ఉంటుంది. అంతేతప్ప రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో కేంద్రం రుణం మంజూరు చేసే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2010–11 ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 నాటికే పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే అప్పగించి ఉంటే.. ఆ ప్రాజెక్టు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఏప్రిల్‌ 1, 2014 నుంచి చేసిన ఖర్చును మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఆ నిధులను కూడా నాబార్డు ద్వారా రుణం ఇప్పిస్తామని తేల్చిచెప్పింది. ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.40,351.65 కోట్లకు పెంచేస్తూ ప్రతిపాదనలు పంపింది. ఏటా ధరల సర్దుబాటు కింద పది శాతం అంచనా వ్యయం పెరుగుతుందని.. 2019 నాటికి అంచనా వ్యయం రూ.42 వేల కోట్లకు చేరుకుంటుందని నివేదించింది. ఏప్రిల్‌ 1, 2014 నుంచి గత ఫిబ్రవరి ఆఖరు నాటికి రూ.3,762.52 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇలా అరకొరగానే కేటాయింపులు చేస్తూ.. 2019 నాటి పోలవరంను పూర్తి చేస్తామని  చెబుతున్నారు. అలా పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభు త్వ అంచనాల ప్రకారమే  మరో రూ.33 వేల కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.9 కోట్లు. మరోవైపు నాబార్డు రుణం మంజూరు అనుమానాస్పదమే. 2019 నాటికి పోలవరం ఎలా పూర్తవుతుందో చంద్రబాబే చెప్పాలి.

మరిన్ని వార్తలు