బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ

26 Sep, 2019 17:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో చంద్రబాబు ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్‌ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దుకు సంబంధించిన ఫైల్‌పై గత గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేయగా, తాజాగా అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని.. గతంలో టీడీపీ సర్కార్‌ ఇచ్చిన మైనింగ్‌ లీజును రద్దు చేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్‌ లీజును రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్‌ ఫారెస్ట్‌, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ గ్రామాల్లో బాక్సైట్‌ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండేళ్ల కిందటే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు 2,226 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలకు  సీఎం జగన్‌ మాట నిలబెట్టుకున్నారు. (చదవండి: విశాఖ జిల్లాలో.. బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు)

ఐదు జీవోలు జారీ..
బాక్సైట్‌ తవ్వకాల అనుమతులు రద్దుకు సంబంధించి మొత్తం 5 జీవోలను ఏపీ  ప్రభుత్వం జారీ చేసింది.
జీవో నెంబర్‌ 80- విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని రక్తకొండ గ్రామ పరిధిలో 113.192 హెక్టార్ల బాక్సైట్‌ మైనింగ్‌ లీజు  రద్దు 
జీవో నెంబర్‌ 81- చింతపల్లి, అరకులో 152 ఎకరాల బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు 
జీవో నెంబర్‌ 82- అనంతగరి మండలం గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్‌లీజు రద్దు.
జీవో నెంబర్‌ 83 - జెర్రెల బ్లాక్‌–1 లో 85 హెక్టార్ల బాక్సైట్‌ మైనింగ్‌లీజు రద్దు
జీవో నెంబర్‌ 84- జెర్రెల బ్లాక్‌–2,3లో 617 హెక్టార్లకు సంబంధించి చింతపల్లిలో మైనింగ్‌లీజు రద్దు 
జీవో నెంబర్‌ 85- చింతపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో జెర్రెల బ్లాక్‌–3 లో మరో 460 హెక్టార్లలో మైనింగ్‌లీజు రద్దు

మరిన్ని వార్తలు