పల్నాడు అక్రమ మైనింగ్‌ కేసు సీబీఐకి అప్పగింత

4 Sep, 2019 14:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌ కేసుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్‌ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.యరపతినేనిపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి అని, అందుకే అక్రమ మైనింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలియజేశారు. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేనిశ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్‌ టన్నుల తెల్లరాయి (లైమ్‌ స్టోన్‌)ని దోచేశారు. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణచేపట్టింది.ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్‌ కవర్‌లో గత సోమవారం అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్‌ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందనిఅధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించింది. రాష్ట్ర  ప్రభుత్వం కేంద్ర దర్యాప్తుసంస్థలకు ఈ కేసు విచారణను కోరే వ్యవహారంపై నేడు స్పష్టత వచ్చింది. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి  అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తు బదలాయించడంతో మైనింగ్‌ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీలు అక్రమ మైనింగ్‌ కారణంగా రూ. వేల కోట్లు గడించినట్టు గుర్తించారు. మైనింగ్‌ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేనినాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్‌ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్‌ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసుబదలాయించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది.

మరిన్ని వార్తలు