నేటితో వేంపెంట దీక్షలకు ముగింపు  

28 Jun, 2019 07:46 IST|Sakshi

సాక్షి, పాములపాడు(కర్నూలు) : మండలంలోని వేంపెంట గ్రామంలో అక్రమంగా నిర్మించతలపెట్టిన ర్యాంక్‌ మినీ హైడ్రాలిక్‌ పవర్‌ ప్లాంటు రద్దు ప్రకటనతో దీక్షలు ముగియనున్నాయి. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు వేంపెంటకు రానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వేంపెంట వాసుల 1,566 రోజుల పోరాటానికి తగిన ఫలితాన్ని అందించారు. టీడీపీ నాయకులు అక్రమ మార్గంలో, ఫోర్జరీ సంతకాలతో, వేంపెంట గ్రామాన్ని వెలుగోడు మండలంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించి అనుమతులు తెచ్చుకున్న విషయం విధితమే.

ఈ విషయాన్ని గ్రామస్థులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరిస్తే.. అభివృద్ధిని అడ్డుకుంటారా.. అంటూ దురుసుగా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ ఆ గ్రామస్థులకు కళ్ల ముందే కనపడుతోంది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేయగా దీక్షా శిబిరం వద్దకు వచ్చి తాను అధికారంలోకి రాగానే పవర్‌ ప్లాంటు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ప్రకారం నేడు పవర్‌ప్లాంట్‌ను రద్దు చేస్తూ ఆ గ్రామ ప్రజలకు ఆనందపు ఫలాలను అందించారు.
 

మరిన్ని వార్తలు