125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం

7 Jul, 2020 04:46 IST|Sakshi

స్వరాజ్య మైదానంలో  ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

8న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌)లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈనెల 8న సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విగ్రహం శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు.

శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సోమవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శంకుస్థాపనలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, మెమోరియల్‌ హాలు, మెమోరియల్‌ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్‌ స్కేపింగ్, గార్డెన్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ డా. కె.మాధవీలత, నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్, జేసీ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు