విమానాశ్రయాల్లో పటిష్ట ఏర్పాట్లు

15 Mar, 2020 04:33 IST|Sakshi
వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను పరీక్షిస్తున్న సిబ్బంది

విదేశాల నుంచే వచ్చే వారి కోసం ప్రత్యేక ఎయిర్‌ బ్రిడ్జి, క్యూలైన్లు

సింగపూర్, మలేషియా నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి

వైరస్‌ నిర్మూలనకు ప్రత్యేక శానిటేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప విమానా శ్రయాల్లో పౌర విమానయాన శాఖ సూచనల మేరకు థర్మల్‌ స్కానింగ్, శానిటైజేషన్‌ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారి కోసం విశాఖ విమానా శ్రయంలో ప్రత్యేక ఎయిర్‌బ్రిడ్జి, క్యూలైన్లను ఏర్పాటు చేసి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే పంపిస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌ కిషోర్‌ ‘సాక్షి’కి వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

- 15 దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. 
- విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు విమాన సర్వీసులు ఉన్నాయి. 15 దేశాల జాబితాలో సింగపూర్, మలేషియా ఉండగా, దుబాయ్‌ లేదు. దీంతో సింగపూర్, మలేషియా నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం. 
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించి ఆ సమాచారాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, విమానయాన శాఖ, ఇమిగ్రేషన్‌లకు పంపుతున్నాం. 

విశాఖలో చేపట్టిన చర్యలు..
- 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా మూడు షిప్టుల్లో వైద్యులు
- అనుమానిత రోగులను తరలించడానికి ప్రత్యేక అంబులెన్స్‌
- శానిటైజేషన్‌ కోసం ప్రత్యేకంగా 116 మంది సిబ్బంది నియామకం
- ప్రయాణికులు చేతులు శుభ్రపర్చుకోవడానికి శానిటైజర్ల ఏర్పాటు
- సిబ్బంది, ప్రయాణికులకు మాస్కుల పంపిణీ
- విదేశాల నుంచి వచ్చిన వారిని 28 రోజు ల పాటు ఇంటి నుంచి పర్యవేక్షించడం

>
మరిన్ని వార్తలు