ఉద్యోగుల అంతర్గత చర్చలతో మాకేం సంబంధం లేదు

25 Apr, 2020 03:52 IST|Sakshi

రాజధాని తరలింపు అంశంపై హైకోర్టుకు సర్కార్‌ నివేదన

సాక్షి, అమరావతి: రాజధానిని విశాఖపట్నానికి తరలించే విషయంలో ఉద్యోగ సంఘాల అంతర్గత చర్చలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఉద్యోగ సంఘాల చర్చల ఆధారంగా న్యాయస్థానాలు ఓ నిర్ణయానికి రావడానికి వీల్లేదని పేర్కొంది. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని తరలింపు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది.  
 

మరిన్ని వార్తలు