సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుకను జూన్ ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వలంటీర్లు పెన్షనర్ల ఇళ్ల వద్దకే వెళ్లి సొమ్మును అందిస్తారు. ఇందుకోసం రూ.1,421.20 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసి ఆ మొత్తాన్ని పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమచేసింది. కాగా, వలంటీర్లు సోమవారం (జూన్ 1వ తేదీ) ఉదయం నుంచే పెన్షన్లను లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పేషంట్లకు డీబీటీ విధానంలో పెన్షన్ సొమ్మును జమచేస్తారు.