వైద్య పరీక్షలు ప్రైవేటుపరం!

19 Jan, 2015 00:27 IST|Sakshi
వైద్య పరీక్షలు ప్రైవేటుపరం!

రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు
వీటి విలువ సుమారు రూ. 60 కోట్లు
అధికారుల నివేదిక తుంగలోకి
వైద్యులు, జూడాల తీవ్ర అసంతృప్తి
వైద్య సేవలను కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు ఎత్తుగడ


సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాల్సిన సాధారణ వైద్య పరీక్షలను కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు యత్నిస్తోంది. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను కాంట్రాక్టు పద్ధతిపై ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు తెరవెనుక కసరత్తు సాగుతోంది. ఈ కసరత్తు కార్యరూపం దాలిస్తే.. రాష్ట్రంలో నిత్యం లక్షల మంది ఔట్ పేషెంట్లకు, వేల మంది ఇన్‌పేషెంట్లకు కొద్దో గొప్పో అందుతున్న ప్రభుత్వాసుపత్రుల సేవలు ఇకముందు నిర్వీర్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ఇక, ప్రభుత్వాసుపత్రుల్లోకి ప్రైవేటు సంస్థలు చొరబడితే సాధారణ సమయాల్లో రోగులకు పరీక్షలు చేస్తారు. మధ్యాహ్నం తర్వాత ప్రైవేటు రోగులూ ఇక్కడ డబ్బు చెల్లించి చూపించుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత పేదరోగులు వస్తే వారి పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం లక్షల మంది పారామెడికల్ ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆయా సేవల్ని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు ఇస్తే వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలెన్నో అటు సామాన్య ప్రజలను, ఇటు సిబ్బందినీ భయపెడుతున్నాయి. ఇప్పటికే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సేవలు ప్రైవేటుకు ఇచ్చారు. త్వరలో గుంటూరులో కార్డియో థొరాసిక్ సేవలు ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. ఇక ఇప్పుడు.. సాధారణ వైద్య పరీక్షలనూ ప్రైవేటుకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  

రూ.60 కోట్ల కాంట్రాక్ట్!
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని పరీక్షలూ ఉచితంగా అందించేందుకుగాను ప్రభుత్వం రూ.60 కోట్లు ఇస్తోంది. దీనిలో భాగంగా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర వాటితో పాటు సుమారు 72 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేయాలి. అయితే ఈ పనులను ప్రైవేటు సంస్థకు అప్పజెబితే మెరుగైన సేవలు అందుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే కర్నూలు వైద్యకళాశాల, కాకినాడలోని రంగరాయ, విశాఖలోని ఏఎంసీ, విజయవాడలోని సిద్ధార్థ వంటి వైద్య కళాశాలల్లో ఎంఆర్‌ఐ, సీటీస్కాన్ సేవలను కాంట్రాక్టు విధానంలో మెడాల్ సంస్థ దక్కించుకుంది. అదే సంస్థకు సాధారణ వైద్య పరీక్షల కాంట్రాక్టును కూడా అప్పగించనున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఇద్దరు ఉన్నతాధికారులు దీనిపైనే ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఈ డబ్బుతో ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు చేసేందుకు యత్నించాల్సింది పోయి, ప్రైవేటుకు కట్టబెట్టేందుకు యత్నిస్తుండడమే చర్చనీయాంశం.

మీరు భేషుగ్గా చేసినా.. మాకక్కర్లేదు!
 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాను సుమారు 20 పేజీలతో వైద్యవిద్యాశాఖ అధికారులు నివేదిక తయారు చేశారు. రూ.60 కోట్లు గనుక తమకే ఇస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వైద్య కళాశాలల వరకూ మెరుగైన ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించవచ్చునని, ఈ నిధులతో రక్తపరీక్షలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవచ్చునని నివేదిక ఇచ్చారు. అంతేగాకుండా ఆసుపత్రులు అభివృద్ధి చెందుతాయని, వైద్య విద్యార్థులకూ ఉపయోగకరంగా ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు.   ఈ నివేదికను పైఅధికారులు బుట్టదాఖలు చేశారు. కనీసం ఒక్కో వైద్య కళాశాలకు రూ. కోటి ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినా ఎవరూ వినడం లేదు.

ప్రైవేటు.. చేటే!: అధికారులు, వైద్యులు
సాధారణ వైద్య పరీక్షలను ప్రైవేటుకు అప్పగిస్తే.. తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైద్య విద్యాశాఖ అధికారులు, జూడా సంఘాలు పేర్కొంటున్నాయి. వీరు చెబుతున్న అంశాల మేరకు..

# ప్రైవేటు సంస్థకు ఇస్తున్న రూ. కోట్ల నిధులను ప్రభుత్వాసుపత్రుల్లో ఖర్చు చేస్తే హాస్పటళ్లు బలోపేతమవుతాయి.
# రూ. 60 కోట్లతో ఉచిత వైద్య పరీక్షలు కల్పిస్తే కనీసం వెయ్యిమంది పారామెడికల్ ఉద్యోగులు అవసరమవుతారు. కానీ ప్రైవేటు సంస్థకిస్తే తమ కిష్టమైన వారిని నియమించుకుంటారు. ప్రస్తుత పారామెడికల్ సిబ్బంది పరిస్థితి ఏమిటి?
# ప్రైవేటు వ్యక్తులకూ ఇక్కడ పరీక్షలు చేయవచ్చు కాబట్టి ఆ రోగులను ప్రభుత్వ ఖాతాలో చూపించి వసూళ్లు చేసిన సందర్భాలున్నాయి. అలాంటివి ఇప్పుడు కూడా జరిగే అవకాశముంది. వైద్యసేవలు నిర్వహించే ప్రైవేటు సంస్థ ఉదయం పూట వచ్చే రోగులకు కావాలనే తాత్సారం చేసి, సాయంత్రం వారి నుంచి డబ్బులు డిమాండు చేసే అవకాశాలు లేకపోలేదు.

ఇది శాశ్వత పరిష్కారం కాదు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు సంస్థల సేవలు శాశ్వత పరిష్కారం కాదు. ఇలా చేసుకుంటూ వెళితే ప్రభుత్వాసుపత్రులు ఎప్పుడు బలోపేతం కావాలి? సిబ్బంది నియామకాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం ఎంఆర్‌ఐ, సీటీస్కాన్ సేవలు చేస్తున్న సంస్థల మీద స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రిన్సిపాళ్లకు అధికారం లేదు. ఈ పరిస్థితుల్లో రోగులకు జవాబుదారీ ఎవరు?     
- డా. క్రాంతి, జూనియర్ వైద్యుల సంఘం

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega