ఇంకా దారిలోనే సరుకులు!

18 Oct, 2014 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తుపాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం బియ్యం కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. మొదట్లో 5 లక్షల బాధిత కుటుంబాలకు నిర్ణయించిన మేరకు సరుకులన్నీ ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినా ఆ మేరకే సేకరణ  చేయలేదు. ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించ కపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

క్షేత్రస్థాయి నుంచి అందిన లెక్కల మేరకు తాజాగా 6,44,045 బాధిత కుటుంబాలను అధికారికంగా గుర్తించారు. ఈ సంఖ్య 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రులు, అధికారులు హడావుడి చేస్తున్నారేతప్ప బాధితులకు నిత్యావసర వస్తువులు అందించడంలో చర్యలు తీసుకోవడం లేదు. 4 రోజులుగా వాహనాలు ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నాయంటున్నారు.

శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు విశాఖకు 400 కిలోలీటర్ల పామాయిల్ అవసరం ఉందని జిల్లా కలెక్టర్ నివేదికలు పం పగా ఇప్పటివరకు 202.4 కిలోలీటర్లు మాత్రమే అక్కడకు చేరింది. కందిపప్పు 800 మెట్రిక్ టన్నులకు గాను 147 టన్నులు, ఉప్పు 400 మెట్రిక్ టన్నులకు గాను 96 మెట్రిక్ టన్నులు, కారం పొడి 200 మెట్రిక్ టన్నులకు గాను 10 మెట్రిక్ టన్నులు, ఉల్లిపాయలు 800 మెట్రిక్ టన్నులకు 37 టన్నులు, బంగాళాదుంపలు 1,200 మెట్రిక్ టన్నులకు 94 మెట్రిక్ టన్నులు మాత్రమే విశాఖపట్నం చేరాయి.

శ్రీకాకుళం జిల్లాకు 224 కిలో లీటర్ల పామాయిల్‌కు గాను 113.2 కిలో లీటర్లు, కందిపప్పు 448 మెట్రిక్ టన్నులకు గాను 17 మెట్రిక్ టన్నులు, ఉప్పు 224 మెట్రిక్ టన్నులకు గాను 50 మెట్రిక్ టన్నులు చేరింది, కారం పొడి 112 మెట్రిక్ టన్నులకు ఒక్క ప్యాకెట్ కూడా అందలేదు. ఉల్లి పాయలు 449 మెట్రిక్ టన్నులకు గాను 57 టన్నులు, బంగాళదుంపలు 672 మెట్రిక్ టన్నులకు 40 మెట్రిక్ టన్నులే అక్కడకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

విజయనగరం జిల్లాకు 20 కిలోలీటర్ల పామాయిల్ అవసరం ఉండగా 18 కిలో లీటర్లు, 40 మెట్రిక్ టన్నుల కంది పప్పు, 20 మెట్రిక్ టన్నుల ఉప్పు అందింది. కారంపొడి 10 మెట్రిక్ టన్ను ల అవసరం ఉండగా ఒక్క ప్యాకెట్టూ పంపలేదు. 3 జిల్లాల్లోనూ 71,438 కుటుంబాలకే 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు