నేడు జిల్లాలకు ‘సచివాలయ’ మెరిట్‌ జాబితా

20 Sep, 2019 11:35 IST|Sakshi

జిల్లాల్లో పోస్టులు, రిజర్వేషన్లు ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌

ఎంపికైన వారికి జిల్లా కమిటీ ద్వారా కాల్‌ లెటర్లు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలపై కమిషనర్‌ గిరిజా శంకర్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్‌ కమిటీలు కాల్‌ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్‌ జాబితాలు శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్టు వెల్లడించారు. మెరిట్‌ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్‌ కమిటీ.. ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు, కేటగిరీల వారీగా రిజర్వేషన్‌ పోస్టుల సంఖ్యను షార్ట్‌ లిస్ట్‌ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం కల్లా జిల్లాల్లో షార్ట్‌ లిస్టు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయిన వెంటనే  ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

షార్ట్‌ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు వారి కాల్‌లెటర్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్‌ కమిటీలు మెయిల్‌ ద్వారా కూడా సమాచారం ఇస్తారని, అంతేగాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోనూ ఎంపికైన వారి జాబితా ఉంచనున్నామని చెప్పారు. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్‌ లెటర్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కాల్‌లెటర్లు అందిన వారు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియకు హాజరు అయ్యి తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక కాల్‌ లెటర్లు వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్‌ కేసులు లేనివారై ఉండాలి. (చదవండి: ‘సచివాలయ’ పరీక్షల ఫలితాల్లోనూ రికార్డ్‌)

మరిన్ని వార్తలు