‘సచివాలయ’ ఫలితాలు విడుదల

19 Sep, 2019 13:21 IST|Sakshi

సాక్షి, అమరావతి :  లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం..  కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు.

ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.  ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి అక్టోబర్‌ 1వరకు శిక్షణ ఇస్తారు. పరీక్ష విడుదల కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. 

రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం : సీఎం జగన్‌
ఎన్నికల్లో చెప్పినట్లుగా సచివాలయ ఉద్యోగాలను రికార్డు సమయంలో భర్తి చేశామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ‘ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 1,26,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపికైన వారికి మంచి శిక్షణ ఇస్తాం. వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలి. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు. అంకితభావంతో పరీక్షలు నిర్వహించి మంచి పనితీరును కనబరిచారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయి’  అని సీఎం జగన్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు