సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కరోనా కేసులు వెలుగు చూడటంతో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారణకు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిని కూడా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో విచారణ జరపాలని నిర్ణయించింది. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కేసుల విచారణలో పాల్గొంటారు. అలాగే, న్యాయస్థానం ముందు దాఖలయ్యే వివిధ పిటిషన్లు సైతం ఈ-ఫైలింగ్ పద్ధతిలో మాత్రమే నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మెయిల్లో అటాచ్మెంట్లు స్వీకరించబోమని స్పష్టం చేసింది. తాజా మార్పులకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. (16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి కరోనా)