నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

28 Feb, 2018 03:55 IST|Sakshi

పరీక్షకు హాజరుకానున్న 10.26 లక్షల మంది

1,423 కేంద్రాల్లో మార్చి 19 వరకు..

కాపీ చేస్తే నాలుగేళ్లపాటు డిబార్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు బుధవారం (నేడు) నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,423 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 10,26,891 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీటిలో 48 కాలేజీల్లో సెల్ఫ్‌ సెంటర్లను ఏర్పాటుచేశారు. మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నపత్రాల సెట్‌ను బుధవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు. 28న ఫస్టియర్, 29న సెకండియర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫస్టియర్‌కు 5,09,898 మంది, సెకండియర్‌కు 5,16,993 మంది హాజరవుతారు.

వీరిలో వొకేషనల్‌ విద్యార్థులు 63,419 మంది ఉన్నారు. కాగా, అధికారులు సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాలను గుర్తించి ఆయాచోట్ల అదనపు భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పరీక్షలు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల్లో కాపీ చేస్తూ పట్టుబడితే నాలుగేళ్ల వరకు అనుమతించకుండా డిబార్‌ చేసేలా కొత్త నిబంధన పెట్టారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ‘ఐపీఈ సెంటర్‌ లొకేటర్‌’ అనే ప్రత్యేక యాప్‌ను కూడా బోర్డు రూపొందించింది.  హాల్‌టికెట్‌ నెంబర్‌ నమోదుచేస్తే సెంటర్‌ రూట్‌మ్యాప్‌ చూపిస్తుంది. ఇదిలాఉంటే.. ఈ ఏడాది నుంచి ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్న సంగతి తెలసిందే. 

సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు: పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 0866–2974130, ఫ్యాక్స్‌ నెంబర్‌ 0866–2970056, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18002749868కు తెలియజేయాలని కార్యదర్శి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు