శాసనమండలిలో అమరావతిపై చర్చ 

16 Dec, 2019 19:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘రాజధాని విషయంలో తెలుగుదేశం సభ్యుల మాటల్లో వారు దోచుకున్నది, ఆక్రమించుకున్నది ఏమైపోతుందో అన్న భయం వారిలో కనబడుతోంది’  అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం రాజధాని అమరావతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం చట్టాలను విస్మరించి భూములు లాక్కుంది. చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయకూడదు. మొదట్లో సీఆర్‌డీఏ పరిధి 217 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అయితే చంద్రబాబు బంధువు కోసం పరిధిని పెంచి 498 ఎకరాలు కేటాయించారు. 

ఎకరం రూ.లక్ష చొప్పున చంద్రబాబు తన బంధువుకు కేటాయించారు. ఇక  తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగులు పిల్లర్లు వేశారు. దీనివల్ల ఖర్చు పెరిగింది.  అసైన్డ్‌ భూముల కొనుగోళ్లను రద్దు చేసేందుకు కేబినెట్‌ నిర‍్ణయించింది. గతంలో శివరామకృష్ణ కమిటీ విజయవాడ, గుంటూరు మధ్య అతి సారవంతమైన భూములు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాంతం రాజధానికి అనువైనది కాదని తెలిపింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికను పరిశీలిస్తాం. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం ఉంటుంది.’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు