తొందరపాటులో పోలీసులపై ఆరోపణలు: డీజీపీ సవాంగ్‌

14 Mar, 2020 16:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగినట్లు ప్రచారం చేయొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  విజయవాడలో శనివారం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఏపీ పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. (వీడియోలు తీయండి.. గొడవ చేయండి

ఆమె చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే..
అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సంఘటనపై డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలతో పాటు, ఆయన చూపించిన వీడియోపై డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థి చుట్టు ఉన్నది టీడీపీ నేతలే అని, నామినేషన్‌ ఎవరో దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. (ఆడలేక మద్దెల ఓడు)

ఎన్నికల నిర్వహణకు మానిటరింగ్‌ సెల్‌ 
నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా 35 సంఘటనలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా 43 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల నామినేషన్లలో 14 ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించారన్నారు. కేవలం ఎనిమిది సంఘటనల్లో మాత్రమే 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు అయినట్లు డీజీపీ తెలిపారు. అలాగే ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయంలో మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (కాషాయ పవనం.. సైకిల్పై పయనం

రూ.కోటి 84 లక్షల నగదు సీజ్‌
పోలీసుల దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకూ పోలీసుల తనిఖీల్లో రూ.కోటి 84 లక్షల నగదు సీజ్‌ చేశామని, రౌడీ షీటర్లను బైండోవర్‌ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, 701 మొబైల్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిఘా యాప్‌ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. (కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేసిన జేసీ!)

రికార్డు స్థాయిలో... ఆపరేషన్‌ సురా
1,1386 బైండోవర్ కేసులు నమోదు చేశామని, అలాగే 10,980 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నామని, జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల పోలింగ్‌ స్టేషన్ల వద్ద  27,735 మంది, సమస్యాత్మక ప్రాంతాల్లో 4,399 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఆపరేషన్‌ సురా పేరుతో రికార్డు స్థాయిలో నాటు సారా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరిగేవని, ఈసారి అలా జరగకుండా చూడబోతున్నామన్నారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హలు అవుతారంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చిందన్నారు. 
(డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు హైడ్రామా)

వాళ్ల కాల్‌డేటా పరిశీలిస్తున్నాం..
మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమాచర్ల ఎందుకు వెళ్లారో..అక్కడి నుంచి విజయవాడకు ఎలా వచ్చారో విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్లలో ఘటన జరిగితే అక్కడి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారని, మాచర్ల ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారన్నారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. వాళిద్దరూ ఎందుకు మాచర్ల వెళ్లారు, ఎప్పుడు పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. దీనిపై బోండా ఉమ, బుద్ధా వెంకన్న తమకు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని అన్నారు. (అల్లర్లకు పన్నాగం)

మరిన్ని వార్తలు