ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలి

13 Jul, 2020 18:44 IST|Sakshi

జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్  కిట్లు పంపిన ఏపీ ప్రభుత్వం

కరోనా బాధితులు డిశ్చార్జికి ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లు ప్రభుత్వం పంపించిందని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి కరోనా రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్యారోగ్యశాఖ సూచించింది.(ఏపీలో మరో 1919 కరోనా కేసులు)

కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే..అలాంటి వారికి మరోసారి రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని, హైరిస్క్‌ కేసులున్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల అనంతరం డిశ్చార్జి అవుతున్నవారిని పరీక్షించవచ్చని, కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరికీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు