నిర్మల సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

10 Jul, 2020 12:19 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ జరిపారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్‌ కలవనున్నారు. బుగ్గన వెంట ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్‌ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉన్నారు.(ప్రతిష్టాత్మక పనులకు నిధుల కొరత రాకూడదు)

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, పీడీఎస్, జీఎస్టీ బకాయిల మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి చేయూత ఇచ్చేందుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ‘‘అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణలు కేంద్రానికి ఇచ్చాం. 3,500 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్‌‌ చేయాల్సి ఉంది. పోలవరం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చుపెట్టి రీయంబర్స్‌మెంట్‌ అడుగుతోంది. కోవిడ్ కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉంది. విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు నిధుల తో కొత్త ప్రాజెక్టులకు  ఉపయోగిస్తాం. జీఎస్టీ బకాయిలు 3500 కోట్లు రావాలని’’ బుగ్గన తెలిపారు. (సీఎం జగన్‌పై అరబిందో సీఓఓ ప్రశంసలు)

ఏప్రిల్, మే, జూన్ లో  రాష్ట్రానికి 40 శాతం ఆదాయం పడిపోయిందని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ని కలిసి పోలవరం నిధులను విడుదల చేయాలని అడుగుతామని మంత్రి బుగ్గన  చెప్పారు. ‘‘గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను వదిలిపెట్టి ప్యాకేజీకి మార్చుకుంది. ప్యాకేజీలో స్పష్టత లేక  ఈఏపీ నిధులు అంటూ అయోమయాన్ని సృష్టించింది. నిజానికి ఈఏపీ అనేది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ నూతన పథకాలకు కేంద్రం నుంచి గ్రాంట్లు, రెవెన్యూ లోటు నిధులు, కేంద్ర ఆర్థిక సంస్థ నుంచి అప్పుల ద్వారా నిధులను సేకరిస్తాం. క్యాపిటల్ వర్క్ కోసం అప్పులు చేయక తప్పదని’’  మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు