పోలవరంలో వరద తగ్గుముఖం

1 Aug, 2019 17:21 IST|Sakshi
సమీక్షా సమావేశంలో మంత్రులు

సాక్షి, ఏలూరు: పోలవరం వరద ప్రవాహం క్రమేపి తగ్గుతోందని పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరద పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం ఎగువ నున్న 19 గ్రామాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరఫరా చేశామన్నారు. పోలవరంలో మూడు, వేలేరుపాడు లో రెండు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యామ్ వద్ద గోదావరి వరద 26 మీటర్లు ఉందని కాపర్ డ్యామ్‌కు ఎటువంటి భయం లేదన్నారు. రేపటికి వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందన్నారు. వరద గ్రామాల్లో వైద్య శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వైద్యులు, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. సమీక్ష అనంతరం మంత్రులు ప్రత్యేక లాంచీలో కొండ్రుకోట వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.


లాంచీ ఎక్కుతున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. 7 లక్షల 43వేల క్యూసెక్కుల మిగులు జలాలను ధవళేశ్వరం జలవనరుల శాఖ హెడ్‌వర్క్స్‌ అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 13100 క్యూసెక్కుల నీరు వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35.5 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం గోదావరి నది సరాసరి నీటి మట్టం 13.57 మీటర్లుగా ఉంది. కాగా, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయం అయ్యాయి. కుండపోతగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది.

మరిన్ని వార్తలు