గ్యాస్‌ లీకేజీ ఘటన: పీఎఫ్‌హెచ్‌ కంపెనీపై కేసు నమోదు

4 Feb, 2020 20:21 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని  కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామం వద్ద  ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ ఘటనపై రాష్ట్ర మంత్రులు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌, కొండేటి చిట్టిబాబు, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాం నయీం, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు. (కోనసీమలో గ్యాస్‌ బ్లో అవుట్‌)

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కోనసీమలో 5 చోట్ల లీకేజీలు జరిగాయని, ఈ నివేదిక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి విజయసాయిరెడ్డికి అందజేస్తామని తెలిపారు. అపారమైన గ్యాస్‌, చమురు నిల్వలు ఉన్నా.. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి కోనసీమదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉప్పుడి గ్యాస్‌ప్రమాద సంఘటనపై  పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీపై నెగ్లిజెన్సీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేస్తామని ఎస్పీ ఆద్నాం నయీం పేర్కొన్నారు. ఉప్పూడి గ్యాస్‌ బావి వద్ద మరోసారి కార్యకలాపాలు ప్రారంభిస్తే అడ్డుకుంటామని ఉప్పుడి గ్రామస్తులు కలెక్టర్‌కు తెలిపారు.

చదవండి : ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్‌ లీక్‌

 ‘గ్యాస్ నిర్వహణకు సీఎం జగన్‌తో చర్చిస్తాం’

మరిన్ని వార్తలు