ఏపీ మంత్రులకు చేదు అనుభవం

5 Apr, 2018 20:39 IST|Sakshi

సాక్షి, ఏలూరు : ఏపీ మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావులకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ సభలో భాగంగా ఓ మహిళ  ఇద్దరు మంత్రులకు షాకిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి జవహార్ విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ ధైర్యంగా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదంటూ సభలో నిలదీశారు. దీంతో అవాక్కవ్వడం వేదిక మీదున్న మంత్రుల వంతయింది. 

వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఆ మహిళ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ, వైఎస్ జగన్ గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ పరుడు, ఆయన గురించి తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ మంత్రులను సభలోనే కడిగిపారేశారు. వైఎస్ జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, జై జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బుజ్జి సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు