కరోనా: నియంత్రణకు అన్ని జిల్లాల్లోనూ విస్తృత చర్యలు

24 Mar, 2020 20:58 IST|Sakshi

కోవిడ్ నియంత్రణకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తృత చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: కోవిడ్ -19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అన్ని రకాల రవాణా వ్యవస్థల్ని రద్దు చేసిన ప్రభుత్వం.. అంతర్‌రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది.  తాజాగా అంతర్ జిల్లా సరిహద్దులను కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు పౌరుల కదిలికలపై పూర్తి స్ధాయిలో ఆంక్షలు విధించింది. కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’)

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లతోపాటు ఆరోగ్య సిబ్బంది, వైద్యులు కరోనా వైరస్‌పై నిరంతరం క్షేత్రస్ధాయిలో సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసు యంత్రాంగం పక్కాగా అమలు చేయడంతోపాటు.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పౌర సంచారాన్ని నియంత్రించింది. ఈ సంందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఓ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది.
‘ప్రతి పౌరుడు వారియర్‌గా పోరాడాలి’

విజయనగరం జిల్లా: 

  • భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతినకుండా  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామ‌తీర్ధంలోని సీతారామ‌స్వామి ఆల‌యంలో య‌థావిధిగా ఉగాది, శ్రీ‌రామ న‌వ‌మి  వేడుక‌ల‌ను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, నెల్లిమ‌ర్ల ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. 
  • రామ‌తీర్ధం ఆల‌యంలో వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎమ్మెల్యే, ఆల‌య అధికారులతో జిల్లా క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా ఈ వేడుక‌ల‌కు భక్తుల‌కు ప్ర‌వేశం లేద‌ని.. అయితే య‌థావిధిగా ఆల‌య పూజారులు, ముఖ్యుల మ‌ధ్య ఉగాది వేడుక‌లు, శ్రీ‌రామ‌న‌వ‌మి క‌ల్యాణం జ‌రుగుతాయ‌ని వారు తెలిపారు. 
  • క‌రోనా వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు నేటి నుంచి జిల్లాలో 144 వ సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుందని,  అలాగే వ్య‌క్తుల మ‌ధ్య సామాజిక దూరాన్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంద‌న్నారు. 
  • విదేశాల నుండి వచ్చిన వారి నుండే స్థానికులకు కరోనా వ్యాధి సంక్రమిస్తున్నందున వారిపై ప్రత్యెక పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ చెప్పారు. వారు తమ ఇళ్ళ నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ లో ఉంచాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 
  • సీఎంవో నుంచి వచ్చిన సమాచారం మేరకు జిల్లాకు 321 మంది వివిధ దేశాల నుండి వచ్చారు. వారిలో  ఆయా మండలాలు, పట్టణాల్లో ఎంత మంది వాస్తవంగా ఉన్నదీ మండల అధికారులు, మునిసిపల్ అధికారులు మరో సారి మండలం, పట్టణం, గ్రామం వారీగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. 
  • జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.  
  • జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెంచి విక్రయిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని.. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామన్నారు. పోలీస్, రెవిన్యూ, మునిసిపల్ శాఖలు సంయుక్తంగా ఇటువంటి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
  •  జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ ప్రజలు సామూహికంగా.. పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేసారు
    అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

పశ్చిమ గోదావరి లాక్‌డౌన్‌ 
కరానోపై పోరాటంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన కూరగాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పారు. రేపటి నుంచి ఏలూరు ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. (పాలకుల నిర్లక్ష్యం ఖరీదు కరోనా!)

నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు సమయంలో ప్రజలు ఒకరి నుంచి మరొకరు వీలైనంత సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి షాపులోనూ, రైతు బజార్లలోనూ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే నిత్యావసర వస్తువుల వాహనాలకు ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతి ఉంటేనే జిల్లాలోకి అనుమతిస్తామని చెప్పారు. రైతు బజార్లు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని, పెట్రోల్ బంకుల్లో ఉదయం11 గంటల వరకూ విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్లతో జేసీ వెంకట్రామిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఈ నెల 29న రేషన్ సరుకుల పంపిణీకి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు.  

వైద్య, ఆరోగ్యశాఖాధికారులతోనూ, డిస్ట్రిక్ రెస్పాన్స్ టీమ్తోనూ జేసీ-2 తేజ్ భరత్ సమావేశం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులకు గైర్హాజరు కావొద్దని వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు.  అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబరుకు చెప్పాలని జిల్లా వాసులకు జేసీ -2 సూచించారు.  ఏలూరులో తెరిచి వున్న షాపులను మూయించిన కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వస్తున్న జనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారన్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హెచ్చరించారు.

జిల్లా అంతా లాక్ డౌన్

•    వెలవెలబోయిన ఏలూరు, భీమరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం బస్టాండ్లు
•    ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యం
•    తెరుచుకోని షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు
•    జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ బ్లీచింగ్ చల్లించిన అధికారులు

వైఎస్ఆర్ కడప జిల్లా ముఖ్యాంశాలు

  • కడప రైతు బజార్లో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గౌతమిలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల పట్టీలను పరిశీలించి, నిర్ణీత ధరలకే వినియోగదారులకు అమ్మాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ధరలను పెంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాపారులను హెచ్చరించారు.
  •  మధ్యాహ్నం కడప ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. ఐసోలేషన్ కొత్త వార్డుల ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే ఐపిలో ఉన్న ఐసోలేషన్ వార్డులను,  త్రోట్ స్వాబ్ శాంపిల్స్ తీసే రూములను పరిశీలించారు.  అనుమానిత కేసులకు ఎలాంటి సర్వీసులను నిర్వహిస్తున్నారో.. కరోనా నోడల్ అధికారి డా.సురేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే సర్జికల్ ఐసియు విభాగంలో సర్జికల్, పోస్ట్ ఆపరేటీవ్, పోస్ట్ ఆపరేటీవ్ ఆర్థ్రో యూనిట్లను పరిశీలించి అక్కడి పరిస్థితులను జీజీహెచ్ పర్యవేక్షకులు డా.గిరిధర్ను అడిగి తెలుసుకున్నారు.
  • జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప జడ్పీ కార్యాలయం వద్ద కరోనా నియంత్రణ పై నగర ప్రజలకు కడప డీఎస్పీ సూర్యనారాయణ అవగాహన కల్పించారు. "జనతా కర్ఫ్యూ" కొనసాగింపు వల్ల, సామాజిక దూరం, స్వచ్చంద గృహ నిర్బంధం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. నగరంలో పలు చోట్ల పోలీసు అధికారులు రోడ్లపైనే అవగాహన కల్పిస్తున్నారు. 
  • లాక్డౌన్లో భాగంగా.. జిల్లాలో మూడవ రోజు "జనతా కర్ఫ్యూ" ఆశించిన మేరకు జరుగుతోంది. రెండవ రోజుతో పోలిస్తే మంగళవారం రోడ్డుపై జన సంచారం చాలా తక్కువగా కనిపిస్తోంది. కర్ఫ్యూ నిర్వహణ పోలీసుల కనుసన్నల్లో నిక్కచ్చిగా సాగుతోంది. చెక్ పోస్టుల్లో వాహనాల తనికీలు విస్తృతంగా జరుగుతున్నాయి.
  • మార్కెట్లు షాపింగ్ కాంప్లెక్సులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకుల అంగళ్ళు తప్ప ఉదయం 9 గంటల తర్వాత మూతపడ్డాయి. మద్యం, మాంసం దుకాణాలు రెండురోజులుగా పూర్తిగా మూతపడ్డాయి.
  • నగరంలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మానుష్యంగా ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల కలాపాలు స్తంభించాయి. కీలకమైన శాఖల్లో షిఫ్టు విధానంలో విధులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా.. అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. 
  • గ్రామ స్థాయిలో వైద్యాధికారులు పర్యవేక్షణలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్లు ఇంటింటి సర్వే ద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చిన వారి వివరాలను క్షుణ్నంగా జల్లెడ పడుతున్నారు.

శ్రీకాకుళం:
    •  కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక బాధ్యతతో దాతలు విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. ఆర్ట్స్ స్వచ్చంధ సంస్ధ, పి.వి.రామ్మోహన్ ఫౌండేషన్, డా.దానేటి శ్రీధర్, లయన్స్            శ్రీకాకుళం సెంట్రల్ శాఖ మంగళ వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సామాజిక బాధ్యత క్రింద విరాళాలు అందజేసారు.  జిల్లాలో స్వీయ గృహనిర్భందంలో ఉన్నవారికి 14 రోజులకు సరిపడే నిత్యావసర               సరుకులను అందజేయుటకు, కరోనా బాధితులకు ఇతర సహాయ చర్యలు చేపట్టుటకు ఈ నిధులను ఉపయోగించుట జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
    • కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా  స్వీయ నిర్భంద గదులు (క్వారంటైన్) సిద్ధం చేసామని కలెక్టర్ జె నివాస్ చెప్పారు. విదేశాల నుండి 13 మంది సోమవారం జిల్లాకు రాగా, వారందరిని నిర్భంద గదులలో            పెట్టామని తెలిపారు. వారితోపాటు ఈ నెల 21 తరువాత వచ్చిన మరో ఐదుగురిని ..మొత్తంగా  18 మందిని నిర్భంద గదుల్లో పెట్టామని పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు జిల్లాకు 859 మంది విదేశాల          నుండి రాగా.. వారిలో ఇంకా 14 రోజుల గడువు పూర్తి కాని వారు 259 మంది వరకు మాత్రమే ఉన్నారని అన్నారు. 
•    జిల్లా వ్యాప్తంగా రాకపోకలు నిషేధించామని, 144వ సెక్షన్ అమలులో ఉందని, జిల్లా యంత్రాంగం, పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 52 మందిపై సోమ వారం కేసులు నమోదు చేసారని ఆయన తెలిపారు. 
•    కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడా 5 గురు కంటే ఎక్కువ మంది గమిగూడరాదని.. అలాగే ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావద్దంటూ జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 
•    ‌కరోనా వార్తలు కవరేజ్ చేయునపుడు వైరస్ సోకకుండా వ్యక్తి గత ముందుజాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ‌అనుమానాస్పద కేసులు ఉన్నట్లు గుర్తించినా హడావిడిగా కవరేజికి వెళ్లవద్దని.. ‌తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‌కవరేజిలో ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ....
•    నెల్లూరు టౌన్ లో పాజిటివ్ కేసు కల్గిన వ్యక్తిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపారు
•    జిల్లా లో లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలు ఇళ్లలోనే ఉంటూ సహకరిస్తున్నారు
•    జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది
•    జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రజలు సకాలంలో పనులు ముగించుకుని త్వరగానే ఇళ్లకు
•    జిల్లా వ్యాప్తంగా రైతుబజార్లలో నిత్యవసరాలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో సరుకులు
•    అధికారుల సూచన మేరకు ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు
•    ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఎవరూ లేరు
•    ముందస్తుగా స్వీయ గృహ నిర్భంధంలో ముగ్గురు (3) ఉన్నారు
•    హోం ఐసోలేషన్ లో 760 మంది ఉన్నారు
•    జిల్లాలో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు
•    జిల్లా కలెక్టర్ వి.శేషగిరిబాబు  ఆదేశాలతో నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి లో 40 బెడ్స్ తో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు
•    అత్యవసర సమయంలో వినియోగించుకోవడానికి వెంటిలేషన్ సౌకర్యం కల్పించారు
•    అత్యవసరాల కోసం, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్...0861 2326755,744,776,766,772
•    కరోనా హెల్ప్ లైన్ నంబర్, 9618232115..టోల్ ఫ్రీ నెంబర్,1800 425 6773, 0861 2349991

కృష్ణాజిల్లా
కరోనా నేపథ్యంలో కృష్ణ జిల్లా మొత్తం లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి.సోమవారం కొంతమంది ప్రజలు రోడ్లపైకి రాగా మంగళవారం మాత్రం పోలీసుల హెచ్చరికలతో రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఉదయం మాత్రం నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం నగరాలకు వచ్చారు. కలెక్టర్ గారు కంట్రోల్ రూంలో ఉంటూ పరిస్థితులను సమీక్షించారు. మొత్తం 1153 మంది విదేశాల నుంచి జిల్లాకు రాగా, ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది. 1092 మంది హోం ఐసోలేషన్ లో ఉండగా,14 మంది అనుమానితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 6 మంది ఆసుపత్రి నుంచి డిచార్జ్ అయ్యారు. 

విజయవాడ డివిజన్
విజయవాడలో ఉదయం మినహాయిస్తే 9 గంటల తరువాత పోలీసులు నగరంలోకి వచ్చే దారులన్నీ దిగ్బంధం చేశారు. దీంతో బయటి నుంచి ఎవరూ నగరంలోకి వచ్చే అవకాశం లేకుండాపోయింది. వన్ టౌన్‌లో పాజిటివ్ కేసు నమోదు కావడంతో మొత్తం 30 వార్డులపై ప్రత్యేక నిఘా పెట్టారు.  ఆయా వార్డులలో ఉన్న వారు అవసరానికి ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని మిగిలిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ  బయటకు రాకూడదని ఆదేశాలిచ్చారు. ఆయా వార్డుల్లో వాలెంటరీలు, వైద్య సిబ్బంది వార్డు వాసులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విజయవాడ డివిజన్ మొత్తం 16 క్వారైంటిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ సెంటర్, ఈస్ట్, వెస్ట్ లలో వంద పడకల చోప్పన ఏర్పాటు చేశారు.

గుడివాడ డివిజన్‌: పోలీసులు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు. అత్యవసరమైన వారిని మినహా ఎవరినీ రోడ్లపైకి రానివ్వలేదు. ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు బయకు వచ్చేందుకు అవకాశం ఇవ్వడంతో కూరగాయల కొనుగోలు కోసం రైతు బజారులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు.  డిఎస్పి సత్యానందం, ఆర్డివో జి శ్రీనివాసులు డివిజన్ ప్రాంతాలలో పర్యటించి 144 సెక్షన్ అమలను పర్యవేక్షించారు. మంత్రి శ్రీ కొడాలి నానీ డిఎస్పి, ఆర్డివోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం రైతుబజారు వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతు బజారును ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయడంతో పాటు వీలైనన్ని మొబైల్ రైతుబజార్లను ఏర్లాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

గుడివాడకు చెందిన ఒక కుటుంబం తమ కుమారుడు లండన్‌లోనే ఉండిపోయాడని, భారత్‌కు రప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా.. ముఖ్యమంత్రితో మాట్లాడుతానని, భయపడకుండా ఉండాలని ధైర్యం చెప్పారు. ఇక144 సెక్షన్ అతిక్రమణకు సంబంధించి 1 కేసులు నమోదు అయిందని, గుడివాడ డివిజన్‌లో మొత్తం 202 మంది విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు.  గుడివాడ పట్టణంలో 29 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా.. వీరందరికీ ప్రతిరోజు వైద్య సిబ్బంది పరీక్షలు వారి ఇంటివద్దకే వెళ్లి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గుడివాడ ఏరియా హస్పటల్ లో 10 పడకల ఐసోలేషన్ వార్డు ఉండగా గుడివాడలోనే హోమియో హాస్పిటల్ లో 100 పడకల ఐసోలేషన్ వార్డు, కైకలూరు లో చైతన్య టెక్నో స్కూల్ లో 100 పడకలు, పామర్రు సమీపంలోని కూచిపూడి వద్ద వరస సంజీవనీ ఆసుపత్రిలో 100 పడకల వార్డులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేగాక ఆయా వార్డుల్లో వైద్య సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్లు చెప్పారు. 

న్యూజివీడు డివిజన్... 
న్యూజివీడు డివిజన్ లో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో  అధికారులు అమలు చేస్తున్నారు. ఉదయం నిత్యావసర వస్తువుల కోనుగోలు కోసం ప్రజలు బయటకు వచ్చారు. 10 గంటల తరువాత రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి.  సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తిరువూరు సమీపంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు. . అనంతరం మండల కార్యాలయంలో పోలీసులు, వైద్య సిబ్బంది, అధికారులతో సమీక్ష నిర్వహించారు. . డివిజన్‌లో మొత్తం 301 మంది విదేశాల నుంచి వచ్చారు. వీరందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. . న్యూజివీడు, గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కాగా మచిలీపట్నం డివిజన్‌లో ఉదయం 6 నుంచి 9 వరకు బయటకు వచ్చేందుకు అనుమతి ఉండడంతో ప్రజలు భారీ సంఖ్యలో    రైతు బజారు వద్దకు చేరారు. దీంతో ఎస్పీ రవీంద్ర బాబు గారు ఏఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఆర్డివలతో సమావేశమై రైతు బజారును ప్రజలకు అందుబాటులో ఉండేలా పది ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఏఎస్పి, ఆర్డివోలతో కలిసి నగరంలో పర్యటించి లాక్ డౌన్‌ను పర్యవేక్షించారు. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో వీధులన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. డివిజన్లో విదేశాల నుంచి మొత్తం 72 మంది వచ్చారు. వారందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల ఐసోలేషన్ సెంటర్ను పెడన నియోజకవర్గంలో 18 పడకల ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లా..
1. కరోనా గురించి తాజా అప్ డేట్ : ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు..మొతం 21 మంది అనుమానుతుల్లో 5గురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది..మిగితా 16 మందికి రిపోర్టు రావాల్సి ఉంది..జిల్లా అంతటా అధికారులు కరోనా వ్యాధి ప్రభలకుండా తగిన ముందస్తు  చర్యలు తీసుకుంటున్నారు.. ప్రజలని అప్రమత్తం చేస్తూ కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు
2. పాజిటివ్ కేసుల సంఖ్య: 0 
3. నెగెటివ్ కేసుల సంఖ్య : 5 
4. ఐసోలేటెడ్ వార్డుల సంఖ్య: 05 
5. ఈ వార్డుల్లో దాదాపు 200 బెడ్స్ను ABCలుగా వర్గీకరించారు.. దాదాపు 2500 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లు సమాచారం.. వీరిలో 100మందిని B కేటగిరిలో, మరో 53 మందిని C కేటగిరీలో మిగితా వారిని A కేటగిరీ గృహ నిర్బంధ రక్షణ లో ఉంచినట్లు సమాచారం. 
6. రవాణా వ్యవస్థ పనితీరు: జిల్లాలో 100శాతం లాక్ డౌన్ అమలౌతుంది..ఎక్కడిక్కడ చెక్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. 
7. నిత్యవసర రేట్ల గురించి: సాధారణంగా నే ఉన్నాయి. 
8. ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు: రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు.. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
9. పోలీసుల పనితీరు: స్ట్రాంగ్ ఉంది. ద్విచక్ర వాహనాలను కూడా కట్టడి చేస్తూ ఎక్కువ మంది గుమి కూడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
10. కలెక్టర్ సమీక్షలు ( డివిజన్ వైజ్) : జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చ్ ల వద్ద ఉండే బిచ్చగాళ్ల బాగోగులు, ఆరోగ్యం గురించి వాళ్లని స్వచ్ఛంద సేవా సంస్థలు (NGOs)కి అప్పగించే విధంగా ఈరోజు వాళ్లతో సమావేశమై తగిన చర్యలు తీసుకటున్నారు.. జిల్లాలో 16 కరోనా మేనేజ్‌మెంట్ టీంలను ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా కమ్యూనికేషన్, రవాణా, శానిటేషన్, ఆర్ధికపరమైన అంశాలు,నిత్యవసత సరుకులు వంటి వాటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కరోనా మీద ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఆధికారులకు తగిన విధంగా సూచనలిస్తూ కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

విశాఖపట్నంజిల్లా

•     విశాఖలో హైఅలెర్ట్ ప్రకటించిన జిల్లా యంత్రాంగం
•    జిల్లాలో 20 కమిటీలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్
•    అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి
•    నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు
•    హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు వస్తే కేసులు
•    ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా విశాఖ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు :08912590102 
•    అందుబాటులోకి ప్రభుత్వ కార్యాలయం నంబర్లు (విశాఖ DM & HO ఆఫీస్) : 9949379394, 9666556597 

విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ దృష్టిలో కి వచ్చిన కరోనా బాధితులు
•    కరోనా పాజిటివ్ కేసులు : 3
•    ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య : 31
•    ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల సంఖ్య : 12

కరోనా నివారణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన మంత్రులు 
విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో కరోనా నివారణకు ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూంను మంగళవారం తనిఖీ చేసిన AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య, శాఖ మంత్రి ఆళ్ల నాని, విశాఖపట్నం ఇంచార్జి మంత్రి కె కన్నబాబు, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, కంట్రోల్ రూమ్ పని తీరు... విశాఖపట్నం జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కరోనా అనుమానితులు కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నుంచి మంత్రి ఆళ్ల నాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా రానున్న రోజులు చాలా కీలకమని, ఎప్పటికప్పుడు, కరోనా వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి అదేశించారు.

మంత్రుల సమీక్ష...
విశాఖ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదు, కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. విశాఖ కరోనా నియంత్రణ సోమవారం ఆయన అధికారులతో, వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.  కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని, కరోనా నియంత్రణకు ప్రజలు సామజిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు విశాఖలో 20 కమిటీలు నియమించామని, విదేశాలనుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయాలని చెప్పారు. నిబంధనలను పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, రైతు బజార్లలో అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇక మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..  కరోనాను చంద్రబాబు రాజకీయానికి  వాడుకుంటున్నారు మండిపడ్డారు. చంద్రబాబు ధోరణి ఆక్షేపణీయమని, కరోనాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ధ్వజమెత్తారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి 2 గంటల కోసారి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని  తాము ప్రచారం కంటే పని చేయడానికే ప్రాధాన్యతనిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి అవంతి  శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ ప్రజలకు నిత్యావసర వస్తువులు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. పేదలకు ఎలాంటి మేలు చేయాలో ప్రతిదీ చేస్తామని, పేదలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని, అవసరం లేకుండా ప్రజలు రోడ్ల పైకి రావొద్దని సూచించారు. ఇక కరోనాపై మీడియా అవాస్తవాలు ప్రచారం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

కరోనా విలయం : చైనాపై భారీ పరిహారం కోరుతూ కేసు

ప్రకాశం జిల్లా
కరోనా వైరస్‌ను ఎదుర్కొవటానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. ప్రకాశంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒంగోలులోని భాగ్యనగర్‌కు చెందిన మహిళా సాధికారిత భవనాన్ని క్యారంటైన్ కేంద్రంగా మార్చారమని చెప్పారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలన్నారు. నిత్యవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బజార్లను ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని పిలుపు నిచ్చారు. 

ముందస్తు జాగ్రత్త చర్యలతో వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చని కలెక్టర్ సూచించారు. జనతా కర్ఫూ స్ఫ్యూర్తితో జిల్లా ప్రజలు మార్చి 31 వరకు స్శచ్ఛంధ ఈ కర్ఫ్యూ పాటించాలని కోరారు. నిత్యవసరాల కోసం ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే వచ్చి సరుకులు కొనుగోలు చేయాలన్నారు. ఈ రోజు నుంచి మంగళవారం వరకు జిల్లాలో 144 వ సెక్షన్ అమలు చేస్తున్నామని చెప్పారు. జనసంచారాన్ని, వాహనాల నియంత్రణను పూర్తిగా అరికడతామన్నారు. విదేశీ ప్రాంతాల నుంచి 576 మంది వ్యక్తులు జిల్లాకు వచ్చారని వారందర్నీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. జిల్లాను ఏడు జోన్లుగా విభజించి ఉప కలెక్టర్లతో ఏడు బృందాలను నియమించామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను జిల్లా నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు