‘సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం’

17 Aug, 2019 16:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గర్తింపు ఇవ్వడాన్ని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా ఆయన సంతకం లేకుండా కొంతమంది అధికారులు రహస్యంగా గుర్తింపు ఇచ్చారని ఆరోపించారు. గుర్తింపు ఇచ్చిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం రోసా నిబంధనలను అనుసరించి ఎన్నికల ద్వారా నిర్వహణ సభ్యుల నియామకం చేపడుతుందని తెలిపారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రోసా నిబంధనలు పాటించకుండా జీవో 103 ద్వారా గుర్తింపుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఖండించారు. ప్రభుత్వం సంఘాలకు గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి కమిటీ లో చర్చించాలని పేర్కొన్నారు. స్టాఫ్ కౌన్సిల్ లో ఎటువంటి సమాచారం లేకుండానే దొడ్డిదారిన 103 జీవోతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే జీవో 103 రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు