'ఇందిరాగాంధీ పేరు యథావిధిగా ఉంచాలి'

25 Jun, 2015 20:13 IST|Sakshi

హైదరాబాద్‌ : బహుళార్థక ప్రయోజనాలతో చేపట్టిన ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టులో 'ఇందిర' పేరును తొలగించి పోలవరం సాగునీటి ప్రాజెక్టుగా మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ పేరిట నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె పేరును తొలగించడం అత్యంత నీచమైన చర్య అన్నారు. చంద్రబాబు నాయుడుకి రాజకీయ భిక్ష, మంత్రి పదవి ఇచ్చి ఎన్టీఆర్‌కు అల్లుడు కావడానికి కారణమైన ఇందిరాగాంధీ పేరునే ప్రాజెక్టు నుంచి తొలగించడం ఆయన కుంచిత బుద్ధికి తార్కాణం అన్నారు. ప్రాజెక్టుకు పేరు మారుస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని పీసీసీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు