మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

21 Jan, 2020 19:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: మూడు రాజధానుల బిల్లు సోమవారం అసెంబ్లీలో ఆమోదం పొందడంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట వ్యాప్తంగా ప్రజలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుతూ, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా బైక్‌ ర్యాలీలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు.

విశాఖపట్నం: మూడు రాజధానులకు మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిది కొండా రాజీవ్  ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి, దివంగత నేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఫ్లెక్సీలకు క్షీరభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ మళ్లా విజయప్రసాద్‌తో పాటు శ్రీదేవి వర్మ, రాధ, యువశ్రీ, శిరీష, శ్రీదేవి, స్వర్ణ మణి, శశికళ, బోట్టా స్వర్ణ, వరలక్ష్మి తో పాల్గొన్నారు.

విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ పద్మనాభంలో భీమిలి ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో  వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేసి.. సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గిరిబాబు, రాంబాబు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా సోమవారం అసెంబ్లీలో బిల్లు ఆమోదంతో ఏయూలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం కాంతారావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి  ఏయూ ప్రధాన ద్వారం వద్ద నింగిలోకి బెలూన్లను ఎగురవేశారు. అదేవధంగా వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిలో పాటు విద్యార్థి విభాగం నేతలు కళ్యాణ్, మోహన్‌బాబు, ప్రొఫెసర్ వెంకటరావు, ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పాడేరు: విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు కృతజ్ఞతలు  తెలిపారు. పాడేరు మండల కేంద్రం తలారిసింగ్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు వైస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమాన శ్రేణులు 200 బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు.

శ్రీకాళహస్తి: ‘ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’  అంటూ శ్రీకాళహస్తిలో దళిత ఐక్య మహానాడు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది.  ఈ ర్యాలీలో ఐక్యదళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరు చెంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరు దారుణమని.. దళిత ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమని.. చంద్రబాబును జిల్లాల్లో తిరగనివ్వమని కల్లూరు చెంగయ్య హెచ్చరించారు.

నగరి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అందరికీ అందేలా చేయాలని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యంగా చేసిన మూడు రాజధానులు బిల్లు అసెంబ్లీలో సోమవారం ఆమోదం పొందడంతో నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా భర్త ఆర్ కే శెల్వమణి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరి రూరల్ సత్రవాడ నుంచి ఓంశక్తి ఆలయం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరం నిర్వహించిన ఈ  ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే రోజా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’  అని నినాదాలు చేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. జైజగన్.. జై జై జగన్.. అంటూ తమ అభిమాన్ని ప్రజలు, పార్టీ కార్యకర్తలు తెలియజేశారు.

కాకినాడ: అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా సర్పవరం జంక్షన్ వద్ద ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి, పువ్వులు పంచారు. ప్రజలకు ఓ రైతు టమోటాలు పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కురసాల సత్యనారాయణ, సీతారామాంజనేయులు, నురుకుర్తి రామకృష్ణ, బెజవాడ సత్యనారాయణ, పుల్లా కోటేశ్వరరావు, జమ్మలమడక నాగమణీ, సుజాత పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారీ బైక్ ర్యాలీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున సంఘిభవంగా ర్యాలీ చేపట్టారు.

నెల్లూరు: సైదాపురంలో  వైఎస్సార్ విగ్రహాం వద్ద వైస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నోటి రమణారెడ్డి ఆధ్వర్యంలో..  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సైదాపురం బస్టాండ్లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

అనంతపురం: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేసి.. బెలూన్లు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు.

విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నాన్ని ప్రభుత్వం ప్రకటించడంపై మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు  పట్టణ ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు